మనిషి మరణిస్తే ఏడవాలా? నవ్వాలా?
on Oct 7, 2019
ఎవరైనా మరణిస్తే ఏడవాలా? నవ్వాలా? మామూలుగా అయితే మనకు, మనసుకు దగ్గరైన వ్యక్తులు మరణిస్తే ఏడుస్తాం. మనకు తెలియకుండానే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. మనసుకు భారంగా ఉంటుంది. మనకు తెలియని వ్యక్తులు మరణించినా... 'అయ్యో పాపం' అనుకుంటాం. కానీ, చావును సెలబ్రేట్ చేసుకోవాలని దర్శకుడు మారుతి అంటున్నారు. సాయి తేజ్ హీరోగా ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ప్రతి రోజు పండుగే'. 'మనిషి పుట్టినప్పుడు పండగల ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో... అదే విధంగా మనిషి మరణించినప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలని కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంద'ని పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మారుతి తెలిపారు. ఇందులో సాయి తేజ్ ఎన్ఆర్ఐ కుర్రాడిగా, అతని తాతగా సత్య రాజ్ నటిస్తున్నారు. తాత అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే... దర్శకరత్న దాసరి నారాయణరావు తెలిసిన 'తాతా-మనవడు' ఈ చిత్రానికి, ఈరోజు చిత్రానికి సంబంధం లేదని మారుతి అన్నారు. సినిమాను దాదాపుగా రియల్ లొకేషన్స్ లో తెరకెక్కిస్తున్నామని మారుతి తెలిపారు. డిసెంబర్ 10 కి ఫస్ట్ కాపీ రెడీ చేసి నిర్మాత చేతిలో పెడతాననీ... రిలీజ్ డేట్ వాళ్లే డిసైడ్ చేస్తారు అనీ ఆయన అన్నారు. ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని క్రిస్మస్ బరిలో డిసెంబర్ 20న విడుదల చేయనున్నారని సమాచారం.