బాలు నా ఆరోప్రాణం.. అంటూ రోదించిన విశ్వనాథ్!
on Sep 26, 2020
లెజండరీ డైరెక్టర్ కె. విశ్వనాథ్తో ఎస్పీ బాలుకు అవినాభావ సంబంధం. నిజానికి ఇద్దరు బంధువులు కూడా. విశ్వనాథ్కు బాలు వరుసకు సోదరుడు. బాలు ఉత్తమగాయకుడిగా తొలి జాతీయ అవార్డును అందుకుంది విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన సినిమాతోటే. అది విశ్వవిఖ్యాతి గాంచిన 'శంకరాభరణం'. అందులోని ప్రతి పాటా ఒక రసగుళిక. ఆ తర్వాత విశ్వనాథ్ మరో ఆణిముత్యం 'సాగరసంగమం' సినిమాతోనూ బాలు నేషనల్ అవార్డ్ తీసుకున్నారు. బాలు సినీ గాయకుడిగా మారిన రెండేళ్ల తర్వాత విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన సినిమాకు తొలిసారిగా పాడాడు. ఆ సినిమా.. 'ఉండమ్మా బొట్టు పెడతా' (1968). అందులో బాలు పాడిన తొలి పాట 'రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా'.. అప్పట్నుంచీ విశ్వనాథ్తో ఆయన అనుబంధం కొనసాగుతూ వచ్చింది.
విశ్వనాథ్ సినిమా అంటేనే సంగీతానికి అందులో అత్యంత ప్రాధాన్యం ఉంటుందనే విషయం మనకు తెలుసు. శాస్త్రీయ సంగీతానికి పెద్దపీట వేసే విశ్వనాథ్ చిత్రాలు పాటలకు అమిత ప్రసిద్ధి పొందాయి. బాలు లేరనే వార్త తెలియగానే విశ్వనాథ్ దుఃఖానికి అంతులేకుండా పోయింది. స్పందించడానికి కూడా వెంటనే ఆయన నోటి వెంట మాటలు రాలేదు.
"భగవంతుడు ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదు. బాలూ.. నువ్వు నా సోదరుడివి మాత్రమే కాదు, నా ఆరోప్రాణం. అలాంటిది ఇంత తొందరగా జరుగుతుందనుకోలేదు. ఇలాంటప్పుడు మాట్లాడ్డానికి కూడా మాటలు రావు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని, అతని కుటుంబ సభ్యులందరూ దీన్ని ఓర్చుకొని, మామూలు విషయంగా తీసుకోవాలని కోరుతున్నాను." అని చెప్పి కన్నీరు మున్నీరయ్యారు విశ్వనాథ్.
Also Read