దిల్ రాజుకు సవాలుగా మారిన 'వకీల్ సాబ్' లీకులు!
on Jul 4, 2020
ఇటీవలి కాలంలో ప్రొడక్షన్లో ఉన్న భారీ సినిమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్లు లీక్ అవుతుండటం చూస్తూనే ఉన్నాం. ఆమధ్య 'ఆర్ఆర్ఆర్' మూవీ సెట్స్ నుంచి కొన్ని ఫొటోలు లీకవడం, వాటిలో జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు కూడా ఉండటం సంచలనం సృష్టించింది. దాంతో ఆ సినిమా యూనిట్ మెంబర్స్ ఎవరి దగ్గర కూడా సెల్ఫోన్స్ అనేవి సెట్స్ మీదకు రాకుండా రాజమౌళి బృందం జాగ్రత్తపడుతూ వస్తోంది. నిజానికి ఈ లీకులను అడ్డుకోవడం పెద్ద ఛాలెంజ్గా మారిపోయింది.
ఇప్పుడు లేటెస్ట్గా 'వకీల్ సాబ్'కు సైతం లీకుల సవాల్ ఎదురైంది. పవన్ కల్యాణ్ కోర్టులో వాదిస్తున్న సన్నివేశానికి చెందిన ఫొటో ఆన్లైన్లో లీకవడం, క్షణాల వ్యవధిలో అది వైరల్గా మారడం తెలిసిందే. ఆ ఫొటోలో పీకే వెనుక అంజలి కూడా కనిపించింది. పీకే ఫ్యాన్స్ తమ హీరో స్టిల్ చూసి మురిసిపోతుంటే, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు మాత్రం తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. లీకైన ఫొటో మీద వీఎఫ్ఎక్స్ కోసం పంపినట్లు ఉండటంతో.. ఎక్కడ నుంచి అది లీకైందో, ఎవరు లీక్ చేశారో తెలుసుకోవాల్సిందిగా తన బృందానికి రాజు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. అలాగే రానున్న రోజుల్లో ఎలాంటి లీకులు కాకుండా చూసుకోవాలని అన్ని క్రాఫ్ట్లకూ ఆయన హెచ్చరించారని అంటున్నారు.
ఈ తరహా లీకుల వల్ల సందర్భానుసారం విడుదల చేసే పోస్టర్లపై ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గుతుందని రాజు భావిస్తున్నారు. 'అజ్ఞాతవాసి' తర్వాత రెండేళ్ల విరామంతో పవన్ కల్యాణ్ మళ్లీ కెమెరా ముందుకు వచ్చిన సినిమా కావడంతో 'వకీల్ సాబ్' కోసం అందరూ అమితాసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ ఒరిజినల్ 'పింక్'లో అమితాబ్ బచ్చన్ చేసిన క్యారెక్టర్తో పోలిస్తే. పీకే క్యారెక్టర్కు కాస్త హీరోయిజంను జోడించి 'వకీల్ సాబ్'ను శ్రీరామ్ వేణు తీర్చిదిద్దుతున్నాడు. లైంగిక వేధింపులకు గురైన ముగ్గురు యువతుల తరపున కోర్టులో వాదించే వకీలుగా పవన్ నటిస్తుండగా, ఆ ముగ్గురు యువతులుగా నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కనిపించనున్నారు.