డిసెంబరా.. జనవరా.. థియేటర్లు తెరుచుకొనేదెప్పుడు?
on Oct 31, 2020
కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో రెండు తెలుగు రాష్ట్రాలలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికీ కేసులు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే నమోదవుతున్నప్పటికీ జనంలో మునుపటి భయాందోళనలు కనిపించడం లేదు. ఏదేమైనా మన సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయనే విషయంలో స్పష్టత రాలేదు. కేంద్ర ప్రభుత్వం థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీతో ఓపెన్ చేసుకోవచ్చని అనుమతి ఇచ్చినప్పటికీ థియేటర్లను తెరవడానికి ఎగ్జిబిటర్లు ముందుకు రావట్లేదు. దాదాపు ఎనిమిది నెలలుగా థియేటర్లను మూసివేసి ఉంచడంతో తీవ్ర నష్టాలకు గురవుతున్నప్పటికీ తెరవడానికి వారు వెనకడుగు వేస్తున్నారు.
టాలీవుడ్కు సంబంధించి దసరా అనేది పెద్ద సీజన్. వేసవి తర్వాత వచ్చే ఈ సీజన్ కోసం భారీ సినిమాలు ఎదురు చూస్తుంటాయి. అలాంటిది సినిమాల ప్రొడక్షన్ ఆగిపోవడం, దానికి అనుగుణంగా దసరాకు సినిమాలు రెడీ కాకపోవడం, థియేటర్లు తెరుచుకోకపోవడంతో ఈ ఏడాది టాలీవుడ్కు బ్లాక్ దసరాగా మారింది. దీపావళి పండుగకు కూడా అదే పరిస్థితి నెలకొంది. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరవడం వల్ల ప్రయోజనం ఉండదని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు. కొత్త సినిమాలు విడుదలైనప్పుడు 50 శాతం ఆక్యుపెన్సీ వల్ల నష్టమే కానీ లాభం ఉండదని వారంటున్నారు.
డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ నిబంధనకు ఏమాత్రం సుముఖంగా లేరు. భారీ ధరలకు సినిమాలను కొని, సగం థియేటర్లే నిండే పరిస్థితి ఉన్నప్పుడు లాభాల సంగతి అటుంచి, భారీ నష్టాలు మిగులుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ నిబంధనలన్నీ తొలగి పూర్తి ఆక్యుపెన్సీతో రన్ చేసుకొనే అనుమతులు వచ్చినప్పుడే థియేటర్లను రన్ చేయాలని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు. ఆ ప్రకారం చూస్తే డిసెంబర్లోనో లేదంటే 2021 జనవరి మొదట్లోనో థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
Also Read