కేకేఆర్పై సీఎస్కే గెలుపు.. వైరల్ అయిన ధోని భార్య సాక్షి కామెంట్!
on Oct 30, 2020
2020 ఐపీఎల్లో ప్లేఆఫ్స్కు వెళ్లకుండానే తిరుగుముఖం పడుతున్న తొలి టీమ్గా ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. 13 మ్యాచ్లలో అది గెలిచింది ఐదే. అయితే చివరి రెండు మ్యాచ్లు గెలవడంతో సీఎస్కే, ధోనీ ఫ్యాన్స్ కొంత ఊరట చెందారు. గురువారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో చివరలో రవీంద్ర జడేజా హీరోయిక్స్ పర్ఫార్మెన్స్తో ఎల్లో ఆర్మీ విజయం సాధించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఎడమచేతి వాటం ఆటగాడు జడేజా కొట్టిన షాట్స్తో కేకేఆర్ను సీఎస్కే ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.
ఇప్పటివరకూ జరిగిన ఐపీఎల్ సీజన్లతో పోలిస్తే ఈ ఏడాది సీఎస్కే పర్ఫార్మెన్స్ వరస్ట్గా ఉన్నప్పటికీ కేకేఆర్తో సాధించిన విజయాన్ని తేలిగ్గా తీసివేయలేం. 173 రన్స్ను చేజ్ చేసే క్రమంలో క్రీజ్లో రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాముడు ఉన్నంతసేపూ సీఎస్కే గెలుపు సునాయాసమవుతుందని అందరూ అనుకున్నారు. అయితే అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాక పాట్ కమిన్స్ బౌలింగ్లో రుతురాజ్ అవుటవడంతో ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు. చివరి 9 బంతుల్లో 27 పరుగులు చేయాల్సి ఉండటంతో మ్యాచ్పై వారు ఆశలు వదులుకున్నారు. చివరలో జడేజా మెరుపులతో సీఎస్కే ఫ్యాన్స్ ముఖాల్లో ఆనందం వెల్లివెరిసింది.
53 బంతుల్లో 72 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ సీఎస్కే విజయంలో ప్రధాన పాత్ర వహించగా, ధోనీ ఒక్క పరుగుకే అవుటైన సమయంలో ఫర్ఫెక్ట్ ఫినిషయర్ పాత్రను పోషించాడు జడేజా. విజయం సాధించిన వేళ ఆనందాన్ని దాచుకోలేకపోయింది ధోనీ భార్య సాక్షి. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో జడేజా పిక్చర్ను షేర్ చేసి, "బాప్ రే బాప్.." అని క్యాప్షన్ పెట్టి, జడేజాకు దాన్ని ట్యాగ్ చేసింది. ఇది ఆన్లైన్లో వైరల్గా మారింది.