'ల్యాండ్ మార్క్ మూవీస్' లీడింగ్ లేడీస్తో మళ్లీ చిరు, బాలయ్య!
on Apr 1, 2020
'ఖైదీ నంబర్ 150', 'గౌతమిపుత్ర శాతకర్ణి'.. 2017 సంక్రాంతికి వసూళ్ళ వర్షం కురిపించిన భారీ బడ్జెట్ మూవీస్. అంతేకాదు.. ఈ రెండు చిత్రాలు కూడా ఆయా కథానాయకులకు 'ల్యాండ్ మార్క్ మూవీస్'నే. 'ఖైదీ నంబర్ 150'తో మెగాస్టార్ చిరంజీవి నటుడిగా 150 చిత్రాల మైలురాయికి చేరుకుంటే.. 'గౌతమిపుత్ర శాతకర్ణి'తో నటసింహ బాలకృష్ణ 100 చిత్రాల ప్రయాణం పూర్తిచేసుకున్నారు. అలాగే 2017 సంక్రాంతికి 'ల్యాండ్ మార్క్' టచ్ ఇవ్వడమే కాకుండా... ఇద్దరు కూడా కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్స్ అందుకోవడం అప్పట్లో వార్తల్లో నిలిచింది.
కట్ చేస్తే.. అటు చిరు, ఇటు బాలయ్య ఇద్దరు కూడా తమ కొత్త చిత్రాల్లో 'ల్యాండ్ మార్క్' లీడింగ్ లేడీస్తోనే చిందులేస్తున్నారిప్పుడు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ 'ఆచార్య'లో 'ఖైదీ నంబర్ 150' సుందరి కాజల్ అగర్వాల్ నాయికగా ఎంపికైంది. ఇక తన లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'సింహా', 'లెజెండ్' వంటి బ్లాక్బస్టర్స్ అనంతరం బాలయ్య నటిస్తున్న పేరు నిర్ణయించని చిత్రంలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' నాయిక శ్రియ ఓ హీరోయిన్గా నటిస్తోందని టాక్.
మొత్తమ్మీద.. చిరు, బాలయ్య ఇద్దరు కూడా అప్కమింగ్ ఫిలిమ్స్ కోసం 'ల్యాండ్ మార్క్' బ్యూటీస్తోనే ఆడిపాడుతున్నారన్న మాట. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. 2017 సంక్రాంతి తర్వాత మరోసారి బాక్సాఫీస్ బరిలో ఈ చిత్రాలతోనే పోటీపడనున్నారట చిరు, బాలయ్య. కాకపోతే ఈసారి దసరా సీజన్ వేదిక కానుందని సమాచారం.
మరి.. గత సందర్భంలో అచ్చొచ్చిన 'ల్యాండ్ మార్క్' బ్యూటీస్.. ఈ సారి పోటీలోనూ కలిసొచ్చి చిరు, బాలయ్య కెరీర్లో మరోమారు కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్స్ నమోదవుతాయేమో చూడాలి.