స్పెషల్ స్టోరీ: గుణశేఖర్.. హద్దులు లేని క్రియేటివ్ జీనియస్!
on Oct 26, 2020
తొలి చిత్రం 'లాఠీ' (1992)తోనే ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గుణశేఖర్ ఈ 28 సంవత్సరాల కాలంలో రూపొందించింది కేవలం 12 చిత్రాలంటే ఆశ్చర్యం కలగక మానదు. తెలుగు సినిమాకి స్క్రీన్ప్లే పరంగా, ట్రీట్మెంట్ పరంగా ఉన్నత స్థాయిని కల్పించిన దర్శకుల్లో ఆయనా ఒకరు. అయినప్పటికీ చాలా తక్కువ సంఖ్యలో చిత్రాలకు దర్శకత్వం వహించడానికి కారణం.. ఆయనలోని అంకితభావం. తాను చేయబోయే సినిమా తాలూకు సబ్జెక్టుకి సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలన, పరిశోధన చేసుకున్న తర్వాతనే సెల్యులాయిడ్ పైకి ఎక్కించేందుకు ఉపక్రమించడం ఆయన అలవాటు. అందుకనే ఈ 12 చిత్రాల్లో 8 చిత్రాలు అవార్డులు తెచ్చాయి.
'లాఠీ'తో ఉత్తమ తొలి చిత్ర దర్శకునిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు సాధించిన ఆయన, రెండో చిత్రం 'సొగసు చూడతరమా' (1995)కు ఉత్తమ చిత్రం అవార్డును సాధించి పెట్టారు. ఆయన మూడో సినిమా బాలనటులతో రూపొందించిన 'రామాయణం' (1996). శ్రీరాముని పాత్రతో జూనియర్ ఎన్టీఆర్ చెల్డ్ ఆర్టిస్ట్గా ఈ సినిమాతో పరిచయమయ్యాడు. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ బాలల చిత్రం పురస్కారం లభించడం విశేషం. గుణశేఖర్ నాలుగో సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేసిన 'చూడాలని వుంది' (1998). దీనికి అవార్డులు రాలేదు కానీ, బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల రివార్డులు అమితంగా దక్కాయి.
ఐదో సినిమా 'మనోహరం' (2000)కు ఉత్తమ చిత్రంగా నంది అవార్డుతో పాటు, ఉత్తమ కథారచయితగా పురస్కారం అందుకున్నారు గుణశేఖర్. ఇందులో జగపతిబాబు, లయ జంటగా నటించారు. ఆరో సినిమా మాత్రం ఆయనకు బాగా డిజప్పాయింట్మెంట్ కలిగించింది. అది చిరంజీవితో ఆయన చేసిన 'మృగరాజు' (2001). దీనికి అవార్డులు, రివార్డులు రెండూ దక్కలేదు. ఆ లోటును ఆ తర్వాతి సినిమాతో పూడ్చుకున్నారు గుణశేఖర్. ఆ సినిమా.. మహేశ్ క్రేజ్ను అనూహ్య స్థాయిలో పెంచేసిన 'ఒక్కడు' (2003). ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడి అవార్డులను సాధించింది ఈ సినిమా. అంతేకాదు, గుణశేఖర్ ఉత్తమ దర్శకుడిగా, మహేశ్ ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డులను సైతం అందుకున్నారు.
ఆ వెంటనే మహేశ్తోటే తన ఎనిమిదో సినిమానీ చేశారు గుణశేఖర్. అది 2004లో వచ్చిన 'అర్జున్'. మహేశ్కు నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందించింది ఈ సినిమా. ఒకే హీరోతో వరుసగా మూడు సినిమాలు డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఈమధ్య కాలంలో ఎవరైనా ఉన్నారంటే.. అది గుణశేఖరే. 'ఒక్కడు', 'అర్జున్', తర్వాత మరోసారి మహేశ్తోటే 'సైనికుడు' (2006) సినిమా రూపొందించారు గుణశేఖర్. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ నంది అవార్డును ఈ సినిమా అందుకుంది. కానీ బాక్సాఫీస్ పరంగా డిజాస్టర్ అయ్యి, నిర్మాత అశ్వినీదత్కు తీవ్ర నష్టాలు మిగిల్చింది.
పదో సినిమాలో అల్లు అర్జున్ను 'వరుడు' (2010)గా చూపించారు గుణశేఖర్. దీనికి కూడా 'సైనికుడు' తరహా రిజల్టే రావడం ఆశ్చర్యకరం. నంది అవార్డుల్లో బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ పురస్కారం, బాక్సాఫీస్ డిజాస్టర్! పదకొండో సినిమా కూడా ఆయనకు తీవ్ర నిరాశను కలిగించింది. అది.. రవితేజతో తీసిన 'నిప్పు' (2012).
వరుసగా మూడు సినిమాలు డిజాస్టర్ కావడంతో గుణశేఖర్ తీవ్ర విమర్శల పాలయ్యారు. ఆయనలోని సృజనాత్మక శక్తి సన్నగిల్లిందంటూ విమర్శకులు దాడి చేశారు. దీంతో పునరాలోచనలో పడిన గుణశేఖర్.. ఈసారి చరిత్ర మీద దృష్టి సారించారు. కాకతీయ సామ్రాజ్యాన్ని అనితరసాధ్యంగా ఏలిన వీరవనిత రాణి రుద్రమదేవి కథ ఆయనను బాగా ఆకర్షించింది. 'రుద్రమదేవి' పేరుతో అనుష్కను టైటిల్ రోల్లో చూపిస్తూ 2015లో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అల్లు అర్జున్, రానా దగ్గుబాటి కూడా నటించిన ఈ సినిమాలో ఆయనలో మునుపటి వాడి, వేడి కనిపించాయనే ప్రశంసలు లభించాయి.
దాని తర్వాత గుణశేఖర్ చూపు మన ఇతిహాసాల మీదకు మళ్లింది. మొదట 'హిరణ్యకశ్యప' కథను తీద్దామనుకున్నారు. ఆ పాత్రను చేయడానికి రానా, సినిమా నిర్మించడానికి డి. సురేశ్బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే ప్రస్తుతం రానా కమిట్మెంట్స్తో దానికి మరికొంత సమయం పట్టేట్లు కనిపిస్తుండటంతో, ఈలోగా మరో సినిమా తీద్దామని నిర్ణయించుకున్నారు గుణశేఖర్.
మహాభారతం ఆదిపర్వంలో వచ్చే శకుంతల, దుష్యంతుల సుందరప్రేమగాథ ఆయనను ఆకర్షించింది. ఆ కథను మహాకవి కాళిదాసు 'అభిజ్ఞాన శాకుంతలం' పేరుతో నాటకంగా రచించారు. దాని ఆధారంగా 'శాకుంతలం' చిత్రాన్ని రూపొందించనున్నట్లు ఇటీవలే ప్రకటించారు గుణశేఖర్. తెలుగు తెరపై ఇప్పటికే ఎన్టీఆర్, బి. సరోజాదేవి పోషించిన దుష్యంతుడు, శకుంతల పాత్రలకు ఆయన ఎవర్ని ఎంచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఆ ప్రేమకథను గుణశేఖర్ తనదైన శైలిలో, తన సృజనాత్మక శక్తితో ఎలా ఆవిష్కరిస్తారో చూడాలని ప్రేక్షకులు కుతూహలంతో ఎదురు చూస్తున్నారు .
- బుద్ధి యజ్ఞమూర్తి
Also Read