ఆరేళ్ల పాప కిడ్నాప్ చుట్టూ తిరిగే 'బ్రీత్'
on Jul 6, 2020
సియా అనే ఒక ఆరేళ్ల పాపను ముసుగు వ్యక్తి ఒకడు కిడ్నాప్ చేసి, అసాధారణ మొత్తంలో డబ్బు డిమాండ్ చేశాడు. తన కూతుర్ని రక్షించుకోవాలంటే డాక్టర్ అవినాశ్ సభర్వాల్ ఒకర్ని కచ్చితంగా చంపాలి! మరోవైపు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్లోని ప్రతికూల వాతావరణం మధ్య కబీర్ సావంత్ జర్నీ కొనసాగుతుంటుంది. పాప కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్ బాధ్యతను అతను చేపట్టాక అసత్యాలు, వంచనలు, మైండ్ గేమ్స్ మొదలవుతాయి. అవినాశ్ను కబీర్ కలుస్తాడు. తన కూతుర్ని కాపాడుకోడానికి అవినాశ్ ఎంత దూరం వెళ్లాల్సి వచ్చింది?
ఇది.. ప్రైమ్ టీవీలో స్ట్రీమింగ్ కాబోతున్న 'బ్రీత్: ఇన్టు ద షాడోస్' వెబ్ సిరీస్ సీజన్ 1 కథాంశం. డాక్టర్ అవినాశ్ సభర్వాల్గా అభిషేక్ బచ్చన్, కబీర్ సావంత్గా అమిత్ సద్ నటిస్తోన్న ఈ సిరీస్లో అవినాశ్ భార్య పాత్రలో నిత్యా మీనన్ కనిపించనున్నది. సస్పెన్స్, డ్రామా మేళవింపుతో రూపొందిన ఇందులో సయామీ ఖేర్, హృషీకేశ్ జోషి, శ్రీకాంత్ వర్మ, రేషమ్ శ్రీవర్థన్ కీలక పాత్రధారులు. ఆరేళ్ల సియా క్యారెక్టర్ను ఇవనా కౌర్ చేసింది. మయాంక్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ జూలై 10న ప్రైమ్ వీడియోలో విడుదలవుతోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ప్రామిసింగ్గా అనిపిస్తోంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ మునివేళ్ల మీద కూర్చొనేలా చేస్తుందని ఆ ట్రైలర్ను చూస్తే అర్థమవుతోంది.
అటు అభిషేక్ బచ్చన్కూ, ఇటు నిత్యా మీనన్కూ ఇదే తొలి వెబ్ సిరీస్. నటులుగా ఇప్పటికే తమను తాము ప్రూవ్ చేసుకున్న ఆ ఇద్దరూ ఈ సిరీస్లో భార్యాభర్తలుగా కనిపించనుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల నెట్ఫ్లిక్స్లో వచ్చి ఆదరణ పొందిన 'చోక్డ్' మూవీలో సరితా పిళ్లై క్యారెక్టర్తో ఆకట్టుకున్న సయామీ ఖేర్, 'సూపర్ 30' మూవీలో రిపోర్టర్ రఘునాథ్గా కనిపించిన అమిత్ సద్ ఈ సిరీస్తో అందరి దృష్టినీ ఆకట్టుకోవాలని చూస్తున్నారు.