ఆ రచయితకి కొరటాల అన్యాయం చేస్తున్నాడా?
on Apr 18, 2018
భరత్ అనే నేను చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త చిత్రసీమలో చక్కర్లు కొడుతోంది. ఈ కథ దర్శకుడైన కొరటాల శివది కాదట. శ్రీహరి నాను అనే ఓ రచయిత ఈ చిత్రానికి కథ అందించాడన్న ఓ వార్త గట్టిగానే చక్కర్లు కొట్టింది. ఈ కథకి పారితోషికంగా ఏకంగా కోటి రూపాయలు కూడా అందించాడని తెలుస్తోంది. కొరటాల శివ మంచి రచయిత. తన ఖాతాలో హిట్ సినిమాలున్నాయి. ఆ తరవాత దర్శకుడిగా మారాడు. ఇప్పటి వరకూ తీసిన మూడు సినిమాలకూ కథలు తనవే. తన దగ్గర మరో పది కథలు సిద్ధంగా ఉన్నాయట. అలాంటి కొరటాలకు మరో రచయిత కథ అవసరం ఏమొచ్చిందనుకున్నారు? కానీ శ్రీహరి నాను అందించిన పాయింట్ తనకు విపరీతంగా నచ్చి, ఆ కథని కోటి రూపాయలు ఇచ్చి తీసుకున్నాడని సమాచారం. టైటిల్ కార్డులో క్రెడిట్ కూడా ఇస్తానని మాట ఇచ్చాడట. అయితే.. ఇప్పుడు మాత్రం కొరటాల ఈ విషయంపై సమాధానం దాటేస్తున్నాడట. `ఈ కథ నాదే.. శ్రీహరి నాను పాయింట్ మాత్రమే అందించాడు` అని మీడియాతో చెబుతున్నాడు కొరటాల. ఈ విషయం తెలిసి శ్రీహరి నాను చాలా ఇబ్బంది పడుతున్నాడని, క్రెడిట్ తనకు ఇవ్వకుండా కొరటాల అన్యాయం చేస్తున్నాడని వాపోతున్నాడట. `సింహా` చిత్రానికి కొరటాల శివ రచయితగా పనిచేశాడు. ఆ సమయంలో బోయపాటి శ్రీను తనకు క్రెడిట్ ఇవ్వలేదని కొరటాల చాలా బాధపడ్డాడు. కొన్ని ఇంటర్వ్యూలలో కూడా ఆ ప్రస్తావన తీసుకొచ్చాడు. అలాంటిది ఇప్పుడు తను దర్శకుడిగా మారాక మరో రచయితకు అన్యాయం చేయడం విడ్డూరంగా అనిపిస్తోంది. మరి ఈ ఎపిసోడ్లో నిజానిజాలేంటన్నది.. కొరటాలకు, శ్రీహరికి మాత్రమే తెలియాలి.