మహేష్ Vs ఎన్టీఆర్.... రగడ మొదలైంది
on Apr 7, 2018
భరత్ అనే నేను సినిమా ఆడియో ఫంక్షన్ కి ఎన్టీఆర్ అతిథిగా వెళ్తున్నాడు అనేసరికి.. అందరి దృష్టీ ఈ ఆడియో ఫంక్షన్ వైపు మళ్లింది. ఓ స్టార్ హీరో కార్యక్రమానికి మరో స్టార్ హీరో వెళ్లడం నిజంగా ఆహ్వానించదగిన పరిణామమే. ఈ దెబ్బతో మహేష్ కి ఎన్టీఆర్ అభిమానుల అండ దండ దొరికేస్తుందనుకున్నారంతా. కానీ... ఇక్కడే సీన్ రివర్స్ అయ్యింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మహేష్కి సపోర్ట్ చేయాల్సింది పోయి... ఇప్పుడు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నారు. నిజానికి ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి రావడం మహేష్ ఫ్యాన్స్కి ఏ మాత్రం ఇష్టం లేదట. దానికీ కారణం ఉంది. స్పైడర్ అట్టర్ ఫ్లాప్ అయినప్పుడు ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ బోల్డన్ని సెటైర్లు వేశారు. సోషల్ మీడియాలో మహేష్ సినిమా గురించి పోస్టింగులు పెట్టి ఆడుకున్నారు. ఆ సమయంలోనే మహేష్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య రగడ మొదలైంది. మహేష్ సినిమాకి ఎన్టీఆర్ వస్తే.... ఈ గొడవలు సద్దుమణుగుతాయి అనుకున్నారు. కానీ..ఇప్పుడు కూడా ఇద్దరి మధ్య రగడ కొనసాగుతూనే ఉంది. `చివరికి మా హీరోనే దిక్కయ్యాడు చూడండి` అనే అర్థం వచ్చేలా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగులు పెడుతున్నారు. అవి మహేష్ ఫ్యాన్స్ని హర్ట్ చేస్తున్నాయి. `మహేష్ ఉండగా.. మరో హీరో ఎందుకు` అంటూ మహేష్ ఫ్యాన్స్ కూడా.. దర్శక నిర్మాతల్ని నిలదీస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఎన్టీఆర్ ని ఈ కార్యక్రమానికి తీసుకురావడం మహేష్ బాబుకీ ఇష్టం లేదని తెలుస్తోంది. కేవలం కొరటాల శివ మాటని కాదనలేక.. అంగీకరించాడని, లేదంటే మహేష్ ఈ షోని సోలోగా నడిపించేద్దుడని చెప్పుకుంటున్నారు.