బోయపాటికి తలనొప్పిగా మారిన విలన్ రోల్!
on Nov 30, 2020
నందమూరి బాలకృష్ణ సినిమాకు నటీనటుల ఎంపిక అతి పెద్ద సమస్యగా మారిపోయింది. ఊర మాస్ సినిమాల డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఆయన ముచ్చటగా మూడో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తొలి రెండు సినిమాలు 'సింహా', 'లెజెండ్'.. ఒకదాన్ని మించి మరొకటి భారీ విజయం సాధించడంతో ఈ బీబీ3 మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ మూవీతో వారు హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బాలయ్య ఫ్యాన్స్ అమితమైన నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది.
అయితే ఇంతదాకా ప్రధాన తారాగణం ఎంపిక పూర్తికాకపోవడం డైరెక్టర్ బోయపాటికీ, నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డికీ తలనొప్పిగా తయారయ్యింది. నిన్నటిదాకా హీరోయిన్ల ఎంపిక విషయంలో ఎన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో చూశాం. అనేకమంది తారల పేర్లు వినిపించాక, సాయేషా సైగల్ పేరును నిర్మాతలు అనౌన్స్ చేశారు. తర్వాత ఆమె స్థానంలో అవకాశాలు లేక ఖాళీగా ఉన్న ప్రగ్యా జైస్వాల్ వచ్చిందంటున్నారు. మరో నాయికగా పూర్ణను ఖాయం చేశారని వినిపిస్తోంది.
అయితే అప్పటికీ మెయిన్ విలన్ పాత్రధారి ఎంపిక పూర్తికాకపోవడం బోయపాటిని కలవరపరుస్తోంది. ఈ మూవీలో ఒకరికి మించి ఎక్కువగా విలన్లు ఉంటారనీ, వారిలో ఓ విలన్గా నవీన్ చంద్ర ఎంపికయ్యాడనీ అంటున్నారు. 'అరవింద సమేత'లో నెగటివ్ రోల్లో ఆకట్టుకున్న అతడికి మరోసారి ఆ తరహా రోల్ చేసే అవకాశం లభించింది. అయితే రెండో షెడ్యూల్ జరుగుతున్నా మెయిన్ విలన్ను ఎంపిక చేయలేకపోవడం మాత్రం ఇబ్బందికరమైన విషయమే. గతంలో సంజయ్ దత్ను సంప్రదించగా, ఆయన దాన్ని తిరస్కరించారని వినిపించింది. సోనూ సూద్ సైతం ఆ ఆఫర్ను వద్దన్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రచారంలోకి వచ్చింది. చివరకు బోయపాటికి విలన్గా ఎవరు దొరుకుతారో చూడాలి.
Also Read