రెండు మూడు రోజుల్లో పవన్తో దర్శకుడి భేటీ...
on Oct 24, 2020
మలయాళ సినిమా 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చూసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనసుపడ్డాడు. ఆ సినిమా తెలుగు రీమేక్లో నటించాలని అనుకున్నాడు. ఇవన్నీ తెలిసిన విషయాలే. పవన్ ఆప్తమిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఫ్యామిలీ ప్రొడక్షన్ లాంటి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అనుబంధ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ దగ్గర రీమేక్ రైట్స్ ఉండటంతో వాళ్ళు పవన్తో సినిమా చేయడానికి హ్యాపీగా ఉన్నారు. ముందు రవితేజ, రానాతో అనుకున్న రీమేక్ను పవన్, రానాతో ప్లాన్ చేశారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే...
రెండు మూడు రోజుల్లో పవన్తో దర్శకుడు సాగర్ చంద్ర భేటీ కానున్నారు. రవితేజతో రీమేక్ ప్లాన్ చేసినప్పుడు అతడికి సితార సంస్థ దర్శకత్వ బాధ్యతలు అప్పగించింది. పవన్ సీనులోకి వచ్చిన తరవాత దర్శకుడు మారతాడని ప్రచారం జరిగింది. కానీ, సాగర్ చంద్రపై నమ్మకం ఉంచారట. రెండు మూడు రోజుల్లో పవన్ ను కలిసి తెలుగు నేటివిటీకి తగ్గట్టు మలయాళ కథను ఏ విధంగా మార్చిందీ? పవన్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు ఎటువంటి మార్పులు చేసిందీ? వివరించనున్నాడని సమాచారం. మలయాళ సినిమా కంటే తెలుగు వెర్షన్ కొంచెం లెంగ్త్ తక్కువ ఉండేలా చూస్తున్నారట.