అమ్మ చివరి క్షణాల్లో ఆమె కోసం తల్లడిల్లిన అనూప్!
on Oct 30, 2020
అమ్మను మించిన దైవమున్నదా? అన్నాడు ఓ కవి. నిజమే. అమ్మ అనే మాటలోని కమ్మదనం ఇంకే మాటలోనూ వినిపించదు. ఎన్ని ఉన్నప్పటికీ, ఎంత సాధించినప్పటికీ అమ్మ లేని లోటును తీర్చడం ఎవరి తరమూ కాదు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్కు అమ్మానాన్నలిద్దరూ లేరు. సుమారు తొమ్మిదేళ్ల క్రితం ఆయన తండ్రి మృతి చెందారు. ఐదేళ్ల క్రితం తల్లినీ కోల్పోయిన ఆయన బాధ ఎవరూ తీర్చలేనిది. అమ్మ చివరి రోజును తలుచుకుంటే ఆయన కంటి నుంచి నీరు ఆగదు. ఆమె పేరు మనోహరం! ఆమె పేరు లాగానే ఆమె మనసూ మనోహరం!!
గతంలో ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మ చివరి క్షణాలను గుర్తుచేసుకున్నాడు అనూప్. 2015 డిసెంబర్ 17 రాత్రి నాగార్జున సినిమా 'సోగ్గాడే చిన్నినాయనా' రీరికార్డింగ్ పనులతో తన స్టూడియోలో ఉన్నాడు అనూప్. పడుకొనేసరికి తెల్లవారుజాము 3 గంటలయ్యింది. 18వ తేదీ ఉదయం ఏడు గంటలకు ఇంటి నుంచి ఫోన్. అమ్మ బాత్రూమ్లో పడిపోయిందనీ, సీరియస్గా ఉందనీ. బాత్రూమ్లోకి వెళ్లిన ఆమె హైబీపీతో తలతిరిగి పడిపోయింది. ఆమెకున్న ఆరోగ్య సమస్య అదొక్కటే. దాంతో పాటు గుండెపోటు వచ్చింది. లోపల వేసుకున్న గడియ తియ్యలేకపోయింది. అనూప్ తమ్ముడు శ్యాంసన్ తలుపు పగలకొట్టి, అమ్మను బయటకు తీసుకువచ్చాడు. ఈలోగా పది నిమిషాల సమయం గడిచిపోయింది. ఆమె గుండెనొప్పితో విలవిల్లాడుతోంది. వెంటనే అంబులెన్స్లో హాస్పిటల్కు తీసుకుపోయారు. తమ్ముడికి ఫోన్ చేశాడు అనూప్. అంత నొప్పిలోనూ ఫోన్ అందుకొని అతడితో మాట్లాడింది అమ్మ.
ఏం భయపడవద్దనీ, తగ్గిపోతుందనీ అమ్మకు ధైర్యం చెప్పాడు అనూప్. "అమ్మతో అదే నేను చివరిసారి మాట్లాడటం. నేను నేరుగా హాస్పిటల్కు వెళ్లాను. అప్పటికి ఆమె స్పృహలోనే ఉంది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆమెను బతికించలేకపోయారు. తన కుటుంబం కోసం ఎంత చేయాలో అంతా చేసిన అమ్మ, మా ఎదుగుదలలోని ప్రతి దశలోనూ ఉన్న మా అందర్నీ వదలిపెట్టి వెళ్లిపోయింది. అమ్మ చనిపోయిందంటే ఎలా నమ్మడం?" అంటాడు అనూప్. అమ్మ పేరుతో ఏదో ఒకరోజు అనాథాశ్రమం పెడతానని ఆయన చెప్పాడు.
Also Read