సోనాలీ బెంద్రే.. గోల్డీ బెహల్.. ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ!
on Nov 30, 2020
సోనాలీ బెంద్రే అందానికి దాసోహం కాని వాళ్లెవరు? టాలీవుడ్లో మురారి, ఖడ్గం, ఇంద్ర, శంకర్దాదా జిందాబాద్ చిత్రాలలో నటించి, తెలుగు ప్రేక్షకుల్ని తన సమ్మోహన శక్తితో కట్టిపడేసి, వారి హృదయాల్లో స్థానం సంపాదించిన తార ఆమె. గోల్డీ బెహల్ అయినా అంతే. ఆయనది కూదా లవ్ ఎట్ ఫస్ట్ సైట్. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన ఆయన ఓ సినిమా సెట్స్పై సోనాలీని చూసిన క్షణంలోనే మనసు పారేసుకున్నారు.
1994లో బాలీవుడ్ ఫిల్మ్ 'నారాజ్' సినిమా సెట్స్ మీద తొలిసారి సోనాలీని చూశారు గోల్డీ. అప్పటికే ఆమె స్టార్ హీరోయిన్. సౌత్లో బాగా డిమాండ్ ఉన్న తార. ఆమె కనుచూపు కోసం ఎంతోమంది పురుషులు వేచి చూస్తున్న కాలంలో, ఆమె మనసును గెలుచుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. సోనాలీకి గోల్డీని ఇంట్రడ్యూస్ చేసింది ఆయన సోదరి సృష్టి ఆర్య. మొదట సోనాలీలో ఆయనను ఎట్రాక్ట్ చేసిన చాలా నెమ్మదిగా తినే ఆమె అలవాటు. ఆ విషయమే ఆయన చెప్పినప్పుడు ఆమె నొచ్చుకున్నారు. మొత్తానికి అలా తిండి విషయంలో మాటలు కలిశాయి.
ఒకసారి సోనాలీ సెట్స్పై ఓ పక్కన కూర్చొని పుస్తకం చదువుకుంటుంటే, ఆమె దృష్టిలో పడాలని తెగ తాపత్రయపడ్డారు గోల్డీ. అది గమనించి ఆమె నవ్వుకున్నారు. మహేశ్ భట్ డైరెక్షన్లో గోల్డీ 'అంగారే' చిత్రాన్ని నిర్మించారు. అందులో సోనాలీ హీరోయిన్. ఓ వైపు నిర్మాతగా వ్యవహరిస్తూనే, మరోవైపు భట్కు అసిస్టెంట్ డైరెక్టర్గానూ పనిచేశారు గోల్డీ. దాంతో సోనాలీతో మాట్లాడే అవకాశం ఆయనకు ఎక్కువగా లభించింది. అలా ఇద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. అదే సమయంలో సోనాలీ 'మేజర్ సాబ్' సినిమాలోనూ పని చేస్తున్నారు. దాని నిర్మాత అమితాబ్ బచ్చన్. తన క్లోజ్ ప్రెండ్ అయిన అభిషేక్ బచ్చన్ను కలుసుకోవడానికి ఆ సినిమా సెట్స్కు వచ్చేవారు గోల్డీ. అలా అభిషేక్, సోనాలీ, గోల్డీ కలిసి షికార్లు తిరిగేవారు.
ఫలితం.. సోనాలీ, గోల్డీ మధ్య స్నేహం మరింత గాఢతరం అవుతూ వచ్చింది. 'మేజర్ సాబ్' చిత్ర నిర్మాణం సుదీర్ఘ కాలం కొనసాగడం వల్ల వాళ్లు తరచుగా కలుసుకోవడానికి అవకాశం లభించింది. అలా వాళ్లు ప్రేమికులుగా మారడానికి దోహదం చేసింది ఆ మూవీ. నిజానికి చాలా కాలం గోల్డీది వన్ సైడెడ్ లవ్గానే ఉంది. చాలా కాలం గోల్డీని ఆమె ఓ స్నేహితుడిగానే చూశారు. అయితే సోనాలీని గోల్డీ ప్రేమిస్తున్న విషయం ఆయన తల్లి గ్రహించారు. ఆమె దృష్టిలో సోనాలీ ఓ అపురూపమైన అమ్మాయి. అందుకే ఆమెను వదులుకోవద్దని కొడుక్కి ఆమె చెప్పేశారు.
అది ఆయనకు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. లాంగ్ డ్రైవ్లు, వేడి వేడి రాజకీయ చర్చలతో ఆ ఇద్దరూ ఎక్కువ సేపు గడపడానికి అవకాశం లభించింది. అలా వారి మధ్య బంధం బలపడుతూ వచ్చింది. లోకంలో మరెవరి కంటే కూడా సోనాలీ తనను బాగా అర్థం చేసుకుందని ఆయనంటారు. గోల్డీ పదమూడేళ్ల వయసులోనే ఆయన తండ్రి రమేశ్ బెహల్ మృతి చెందగా, తర్వాతి సంవత్సరమే తాతయ్య కన్నుమూశారు. ఐదుగురు స్త్రీల సంరక్షణలో ఆయన పెరిగారు. అమ్మ, నాయనమ్మ, ముగ్గురు అక్కలు. వాళ్ల కారణంగా ఆయన వ్యక్తిత్వమూ దృఢంగా పెంపొందింది. ఈ విషయం సోనాలీ అర్థం చేసుకున్నారు.
తన ఆరాధ్య యువతికి ఆయన సినిమా ఫక్కీలో ప్రపోజల్ చేయాలనుకున్నారు. ఇందుకు తన ఫ్రెండ్స్ సాయం తీసుకున్నారు. ఒకసారి అభిషేక్ బచ్చన్ ఇచ్చిన పార్టీలో ఒంటి మోకాలిపై కూర్చొని, తనను పెళ్లిచేసుకుంటావా అని సోనాలీని అడిగారు. ఆమె యస్ చెప్పారు! ఆ తర్వాత తమ పెద్దవాళ్లకు ఆ విషయం చెప్పారు. సోనాలీ తల్లిదండ్రులు అంత సులువుగా ఒప్పుకోలేదు. ఎందుకంటే.. సోనాలీ కంటే గోల్డీ చిన్నవాడు. ఆమెలా అతను పెద్ద చదువు చదవలేదు. పైగా అతను మహారాష్ట్రియన్ కాదు, ఓ పంజాబీ. మొత్తానికి ఆమెపై తన ప్రేమ ఎలాంటిదో చెప్పి, వాళ్లను కన్విన్స్ చేయగలిగాడు గోల్డీ.
2002 నవంబర్ 12న లావిష్గా జరిగిన వేడుకలో సోనాలీ, గోల్డీ దంపతులయ్యారు. వారి పెళ్లికి సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన అనేకానేక మంది మహామహులు వచ్చారు. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్రావ్ దేశ్ముఖ్, అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ, ఆమిర్ ఖాన్, కాజోల్ లాంటి వాళ్లు వారిలో ఉన్నారు. 18 సంవత్సారల వైవాహిక జీవితంలో ఎన్నో మధుర ఘట్టాలను వారు పంచుకున్నారు. దాంతో పాటు నిరుడు సోనాలీకి కేన్సర్ సోకిందని తెలిసినప్పుడు గోల్డీ గుండె బద్దలైనంత పనైంది. కానీ తనకు తాను ధైర్యం చెప్పుకొని, సోనాలీకి ధైర్యం చెప్పి, ఆమె రికవర్ కావడంలో అండగా నిలిచారు. గోల్డీ ప్రేమే తనను ప్రాణాంతక వ్యాధి నుంచి కాపాడిందని సోనాలీ అంటారు. సంవత్సరాలు గడిచే కొద్దీ వారి ప్రేమ గాఢతరమవుతూ వస్తోందే కానీ, ఏమాత్రం తరగలేదు. 2005లో వారికి రణవీర్ అనే కుమారుడు పుట్టాడు. సోనాలీ తనకిచ్చిన గొప్ప గిఫ్ట్గా రణవీర్ను పేర్కొంటారు గోల్డీ. నేటి యంగ్ కపుల్స్కు వారి ప్రేమగాథ ఓ ఇన్స్పిరేషన్.