'అల..' తిరుపతి సెలబ్రేషన్స్ కేన్సిల్
on Jan 23, 2020
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ 'అల.. వైకుంఠపురములో' బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ హిట్టయిన విషయం తెలిసిందే. పూజా హెగ్డే నాయికగా నటించిన ఈ మూవీ బన్నీ, త్రివిక్రమ్.. ఇద్దరి కెరీర్లోనూ హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచి, ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతోంది. కాగా ఈనెల 24న తిరుపతిలో తలపెట్టిన సక్సెస్ సెలబ్రేషన్స్ను చిత్ర బృందం విరమించుకుంది. సినిమా విడుదలయ్యాక వైజాగ్, తిరుపతి నగరాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ను నిర్వహిస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అందుకు అనుగుణంగా జనవరి 19న వైజాగ్లో అభిమానుల సమక్షంలో భారీ వేడుకను నిర్వహించారు. అందులో 'అల.. వైకుంఠపురములో' ఇండస్ట్రీ హిట్టయినట్లు అల్లు అర్జున్ ప్రకటించారు. తన తండ్రితో కలిసి ఈ ఘనతను అందుకోవడానికి కారకుడైన త్రివిక్రమ్ కు కృతజ్ఞతలు కూడా తెలిపారు.
ఇక తిరుపతిలో జరిగే సెలబ్రేషన్స్లో బన్నీ ఏం మాట్లాడతాడోననే ఆసక్తితో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అతనితో పాటు త్రివిక్రమ్, అల్లు అరవింద్ చెప్పే మాటలు వినాలని కూడా వాళ్లు ఆశించారు. అంతేనా.. వైజాగ్ ఈవెంట్లో బన్నీ, పూజా మధ్య కెమిస్ట్రీ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ కూడా అవగా, అలాంటి సీనే తిరుపతి ఈవెంట్లోనూ రీక్రియేట్ అవుతుందనీ వాళ్లు భావించారు. అయితే తెలీని కారణంతో ఆ ఈవెంట్ను నిర్మాతలు రద్దు చేసుకున్నట్లు తెలిసింది. దానికి బదులుగా ఒక ప్రెస్మీట్ ఏర్పాటు చేయాలని నిర్మాతలు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్ణయించుకున్నారు.
కాగా 'అల.. వైకుంఠపురములో' ఎంత వసూళ్లు సాధించిందనే విషయంలో సరైన లెక్కలు లేవని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. 'సరిలేరు నీకెవ్వరు' నిర్మాతలు ఫేక్ కలెక్షన్స్ చెబుతున్నారనే ఉద్దేశంతో ఈ సినిమా నిర్మాతలు కూడా ఫేక్ కలెక్షన్స్ను తెరపైకి తీసుకురావడంతో జెన్యూన్ హిట్టయినప్పటికీ, క్రెడిబిలిటీ దెబ్బతిన్నదని వాళ్లంటున్నారు. ఒక్క ఓవర్సీస్ కలెక్షన్లు తప్ప తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నిర్మాతలు వెల్లడిస్తున్న లెక్కల్లో నిజాయితీ లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.