సినీ వర్కర్స్కు నాగార్జున రూ. కోటి విరాళం
on Mar 28, 2020
గురు, శుక్రవారాలు అనేకమంది సినీ సెలబ్రిటీలు కరోనా వ్యాధి నిరోధం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధులకూ, ఒకరిద్దరు ప్రధాని సహాయ నిధికీ విరాళాలు ప్రకటించినా రెండు ఫ్యామిలీలు.. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీలు.. స్పందించలేదని విమర్శలు చెలరేగాయి. ఎట్టకేలకు శనివారం మొదటగా దగ్గుబాటి ఫ్యామిలీ స్పందించి రూ. 1 కోటి ఆర్థిక సాయం ప్రకటించగా, లేటెస్టుగా అక్కినేని నాగార్జున రూ. కోటి విరాళం ప్రకటించారు. అయితే ఈ రెండు కుటుంబాలు ముఖ్యమంత్రి సహాయ నిధులకు ఈ విరాళాలు ప్రకటించకపోవడం గమనార్హం. షూటింగ్లు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న సినీ కార్మికులకూ, రోగుల సేవలో నిరంతరం నిమగ్నమై తమ జీవితాలను రిస్కులో పెడుతున్న వైద్య సిబ్బందికీ ఆర్థిక సాయం అందిస్తున్నట్లు దగ్గుబాటి కుటుంబం ప్రకటించింది.
నాగార్జున అయితే సినీ కార్మికుల సంక్షేమం కోసం రూ. కోటి విరాళం అందిస్తున్నానని ప్రకటించారు. లాక్డౌన్ అనేది కఠిన వాస్తవం, ఒక అవిసరం! నా తోటి నటుల స్పందనను ప్రశంసిస్తూ, ఈ కరోనా సంక్షోభంలో దినసరి వేతనంతో బతికే సినీ కార్మికుల సంక్షేమం కోసం నా వంతుగా రూ. 1 కోటి విరాళంగా అందిస్తున్నాను. మనల్ని దేవుడు కాపాడుగాక. ఇంట్లో సురక్షితంగా ఉండండి అని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. ఎక్కువ మంది సెలబ్రిటీలు ప్రజలనందరినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలకు తమ విరాళాలను ప్రకటించగా దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీలు సినీ కార్మికుల సంక్షేమం కోసం విరాళం ఇవ్వడం గమనార్హం.