అఖిల్కి ఆ రెండు ఫ్యాక్టర్స్ కలిసొస్తాయా?
on Jun 3, 2020
ఊహ తెలియని వయసులోనే ‘సిసింద్రీ’గా సంచలన విజయం అందుకున్నాడు అక్కినేని అఖిల్. అయితే కథానాయకుడిగా మాత్రం ఆ తరహా మ్యాజిక్ చేయలేకపోతున్నాడు. ‘అఖిల్’, ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’.. ఇలా ఇప్పటివరకు మూడు చిత్రాలతో సందడి చేసిన అఖిల్కి ఆయా సినిమాలతో చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో కొత్త చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ పైనే ఆశలు పెట్టుకున్నాడు ఈ అక్కినేని థర్డ్ జనరేషన్ హీరో.
‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అఖిల్కి జోడిగా ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాస్ ఈ ఫ్యామిలీ డ్రామాని నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. నిర్మాణానికి శ్రీకారం చుట్టుకున్న దశలో ఈ సినిమాపై అంతగా అంచనాలు లేనప్పటికీ.. ప్రస్తుతం రెండు ఫ్యాక్టర్స్ మాత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’పై బజ్ను పెంచుతున్నాయి.
ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే.. పూజా హెగ్డే, అల్లు అరవింద్ సమర్పణ. ‘అరవింద సమేత’ మొదలుకొని ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’, ‘అల వైకుంఠపురములో’ వరకు పూజ నటించిన ప్రతీ సినిమా వసూళ్ళ వర్షం కురిపించడంతో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ విషయంలోనూ అదే పరంపర కొనసాగే అవకాశముందని సినీ వర్గాలు జోస్యం చెబుతున్నాయి. ఇక అల్లు అరవింద్ సమర్పణలో ఈ మధ్య కాలంలో వచ్చిన ‘గీత గోవిందం’ (విజయ్ దేవరకొండ – కథానాయకుడు), ‘ప్రతిరోజూ పండగే’ (సాయి తేజ్ – హీరో) చిత్రాలు ఆయా హీరోలకి కెరీర్ బెస్ట్ హిట్స్ని అందించాయి.
సో.. పూజా హెగ్డే, ‘అల్లు అరవింద్ ప్రెజెంట్స్’ ఫ్యాక్టర్స్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ విషయంలోనూ కొనసాగి అఖిల్కి తొలి బ్లాక్బస్టర్ దక్కుతుందేమో చూడాలి. కాగా.. సింహభాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ దసరా సీజన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.