సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటున్న బాలయ్య?
on Aug 8, 2019
సంక్రాంతి హీరోగా బాలయ్యకు ఒక ప్రత్యేకమైన పేరుంది. ఆయన పలు సినిమాలు సంక్రాంతికి వచ్చాయి. వాటిలో చాలావరకు విజయ సాధించాయి. 'భలే దొంగ', 'వంశోద్ధారకుడు', 'పెద్దన్నయ్య', 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'లక్ష్మీ నరసింహా', 'గౌతమిపుత్ర శాతకర్ణి', 'జై సింహా' వంటి సినిమాలు అందుకు ఉదాహరణ. కొన్ని సినిమాలు డిజాస్టర్ అయిన సందర్భాలూ ఉన్నాయి. 2019లోనే చూసుకుంటే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా బాలకృష్ణ చేసిన ఎన్టీఆర్ బయోపిక్లోని తొలి భాగం 'యన్.టి.ఆర్: కథానాయకుడు' బాక్సాఫీస్ దగ్గర అవమానకర రీతిలో డిజాస్టర్ అయ్యింది.
ఈ నేపథ్యంలో 2020 సంక్రాంతికి కూడా బాలకృష్ణ సినిమా వస్తుందని ఇప్పటివరకూ ప్రచారం జరుగుతూ వచ్చింది. 2018 సంక్రాంతికి వచ్చిన 'జై సింహా' బాగానే ఆడటంతో అదే కాంబినేషన్ (బాలకృష్ణ - కె.ఎస్. రవికుమార్ - సి. కల్యాణ్)తో తయారవుతున్న తాజా చిత్రాన్ని కూడా సంక్రాంతికి తీసుకురావాలని అనుకున్నారు. అయితే 2020 సంక్రాంతికి మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ - త్రివిక్రం సినిమాలు వస్తుండటంతో వాటితో పోటీపడటం కంటే ముందుగానో, తర్వాతో వస్తే మేలని బాలయ్య బృందం అనుకున్నారనీ, ముందుగా రావడానికే బాలయ్య ఓటేశారనీ చెప్పుకుంటున్నారు. అంటే 2019 క్రిస్టమస్కి ఆయన సినిమా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాలో బాలయ్యతో ముగ్గురు నాయికలు - భూమిక, సోనాల్ చౌహాన్, వేదిక - నటిస్తున్నారు. వీరిలో భూమిక, వేదికకు బాలయ్యతో జోడీకట్టడం ఇదే తొలిసారి.