'సాహో' టీజర్: కొత్తగా ఏమీ లేదు... యాక్షన్ మాత్రమే
on Jun 13, 2019
'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటిస్తున్న 'సాహో' టీజర్ విడుదలైంది. ఒక్క హీరోను తప్పిస్తే మన తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన ముఖాలు టీజర్లో తక్కువ ఉన్నాయి. హీరో తర్వాత హీరోయిన్ శ్రద్ధా కపూర్ కాస్తో కూస్తో తెలుసు. జాకీ ష్రాఫ్ ఇంతకు ముందు కొన్ని తెలుగు సినిమాల్లో నటించినా... ఆయన్ను ఠక్కున గుర్తు పట్టడం కష్టం. నటీనటుల గెటప్స్ అన్నీ హాలీవుడ్ స్టయిల్లో ఉన్నాయి. టీజర్ కూడా! అలాగని, టీజర్ కొత్తగా ఏమీ లేదు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ను తలపించిందంతే! గ్లోబలైజేషన్ కారణంగా టీవీల్లో, మల్టీప్లెక్స్ థియేటర్లలో హాలీవుడ్ యాక్షన్ సినిమాలు చూసే ప్రేక్షకులు ఇంతకు ముందు ఇటువంటి యాక్షన్ చూసే ఉంటారు. చూడనివారికి కొత్తగా ఉంటుంది. యాక్షన్ సీన్స్ భలే ఉన్నాయని అనుకునే అవకాశం ఉంటుంది. 'సాహో' టీమ్ కూడా తెలివిగా 'ఈ ఆగస్టు 15 (ఇండిపెండెన్స్ డే)న ఇండియా నుంచి బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చూడండి' అని చెప్పింది. అసలు కథ గురించి టీజర్లో ఎటువంటి హింట్స్ ఇవ్వలేదు. యాక్షన్ మాత్రమే చూపించారు. ఇంత భారీ యాక్షన్లోనూ ప్రేమకు చోటు ఉందని టీజర్ ప్రారంభంలో స్పష్టం చేశారు. 'సంతోషమైనా... బాధైనా... నాతో షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరు' అని హీరోయిన్ శ్రద్ధా కపూర్ అనగా... 'నేను ఉన్నాను' అని హీరో ప్రభాస్ బదులిస్తాడు. టీజర్లో లాస్ట్ డైలాగ్స్ చెప్పడం కంటే చూడటం మంచిది. హాలీవుడ్ స్టయిల్లో తీసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వొచ్చు. ఇంటర్నేషనల్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో?