'సరిలేరు నీకెవ్వరు' కథ ఇదేనా?
on Jun 1, 2019
మహేష్ బాబు 26వ సినిమా 'సరిలేరు నీకెవ్వరు' శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు 'దిల్' రాజు, అనిల్ సుంకర సినిమాకు ఇలా కొబ్బరికాయ కొట్టారో లేదో... సోషల్ మీడియాలో 'సరిలేరు నీకెవ్వరు' కథ ఇదేనంటూ ఓ కథ చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. మహేష్ ఆర్మీ మేజర్ క్యారెక్టర్ చేస్తున్నారని అనిల్ రావిపూడి చెప్పడంతో ఎవరో కథ అల్లేశారు. అందులో ఉన్నదాని ప్రకారం ఆర్మీలో హీరో స్నేహితుడు ఒకరు మరణిస్తారు. అతడి కుటుంబానికి విషయం చెప్పడానికి మహేష్ వస్తాడట. అసలు విషయం చెప్పడానికి ముందే, వాళ్ళు కష్టాల్లో ఉన్నారని తెలుసుకుని అండగా నిలబడతాడట! ఈ కథలో నిజమెంత ఉందో కానీ.. 'అతడు' స్టోరీ లైన్ కి దగ్గర దగ్గరగా ఉంది. ఎటువంటి కథనైనా వినోదంతో గట్టెకించగల నేర్పు దర్శకుడు అనిల్ రావిపూడి సొంతం. మహేష్ నోటి వెంట అనిల్ కామెడీ పంచ్ డైలాగులు వినాలని ప్రేక్షకులు, ముఖ్యంగా ఘట్టమనేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.