'సాహో' కి సంగీత దర్శకులు ఎక్కువే!
on May 30, 2019
'సాహో' ప్రయాణానికి శంకర్, ఎహసాన్, లాయ్ టాటా బైబై చెప్పేశారు. ఇప్పుడు వాళ్ళ ప్లేసులోకి ఎవరు వస్తారోనని ప్రేక్షకులతో పాటు పరిశ్రమ ప్రముఖులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒకరిద్దరు కాదు... ముగ్గురు నలుగురు సంగీత దర్శకులు 'సాహో'కి పని చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకుల నుంచి పాటలు తీసుకుని, ఒకరి చేత నేపథ్య సంగీతం చేయించాలనే ఆలోచనలో 'సాహో' టీమ్ ఆలోచిస్తుందట. సినిమా నుంచి తప్పుకోవడానికి శంకర్ మహదేవన్ చెప్పిన కారణాలు కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. 'సాహో'కి శంకర్, ఎహసాన్, లాయ్ రెండు మూడు పాటలు కంపోజ్ చేశారు. క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల కొన్ని పాటలు డిస్కషన్ స్టేజిలో ఆగాయి. అప్పుడు ఇతర సంగీత దర్శకుల నుంచి పాటలు తీసుకుంటామని శంకర్, ఎహసాన్, లాయ్ ముందు 'సాహో' బృందం ఒక ప్రపోజల్ పెట్టింది. అది నచ్చక సినిమా నుంచి వారు తప్పుకున్నారు. ఆల్రెడీ ఇతర సంగీత దర్శకుల నుంచి పాటలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్న 'సాహో' టీమ్ కి లైన్ క్లియర్ అయింది. ముందునుంచి కొంతమంది సంగీత దర్శకులను ఆప్షన్ లో పెట్టుకున్నారట. వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నారని టాక్. నేపథ్య సంగీతానికి కూడా ఒకరితో చర్చలు సాగిస్తున్నారట. మొత్తం మీద 'సాహో' టైటిల్ కార్డ్స్ లో సంగీత దర్శకులుగా ఇద్దరి కంటే ఎక్కువ పేర్లు పడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ పేర్లు ఎవరివి అనేది త్వరలో తెలుస్తుంది.