రామ్ చరణ్.... ఆ పని మాత్రం చేయొద్దు!!
on Apr 3, 2018
ఓ సినిమా హిట్టయితే... ఆ క్రేజ్ని వాడుకోవడానికి దర్శక నిర్మాతలు, హీరోలు చాలా రకాలుగా ఆలోచిస్తుంటారు. అందులో సీక్వెల్ ఒకటి. 2018లో ఇప్పటి వరకూ వచ్చిన చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ అయిన చిత్రం... రంగస్థలం. బాహుబలి తరవాత తక్కువ రోజుల్లోనే వంద కోట్లు అందుకున్న చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకీ సీక్వెల్ వస్తుందని ప్రచారం జరుగుతోంది. సుకుమార్ కూడా ఆ ఛాన్సు ఉందీ.... అంటున్నాడు. రంగస్థలం సీక్వెల్ అంటే అది ఖచ్చితంగా రామ్చరణ్తోనే చేయాలి. లేదంటే ఫార్ములా వర్కవుట్ అవ్వదు. అయితే... రంగస్థలంకి సీక్వెల్ అనగానే మెగా అభిమానులు జంకుతున్నారు. `రామ్చరణ్... ఆ పని మాత్రం చేయొద్దు` అంటూ ఫేస్ బుక్స్లో, ట్విట్టర్లలో కామెంట్లు పెడుతున్నారు. దానికీ కారణం ఉంది. సీక్వెల్స్ హిట్టయిన చరిత్ర.. టాలీవుడ్కి లేదు. పైగా ఆ పేరుని చెడగొట్టే సినిమాలే వచ్చాయి. గబ్బర్ సింగ్ తరవాత వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ ఏమైంది?? అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అంతెందుకు ఆర్య తరవాత ఆర్య 2 తీశాడు సుకుమార్. అదీ ఫ్లాప్ అయ్యింది. రంగస్థలం బ్రాండ్ ఇమేజ్ కూడా అలా పాడైపోతోందేమో అన్నది చరణ్ అభిమానుల భయం. అందుకే.. `సీక్వెల్ వద్దుబాబోయ్` అంటున్నారు. ఫ్యాన్స్ మొర చరణ్ ఆలకిస్తాడో లేదో చూడాలి.