ఐటీ రిటర్న్స్ చేయనందుకు నాగార్జునకి శిక్ష
on Jan 5, 2018
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునకి పాపం టైం అస్సలు బాలేదనుకుంటా.. లాస్ట్ ఇయర్ ఆయన నటించిన సినిమాలు ఫ్లాపై నిర్మాతలకు నష్టాలను మిగిల్చగా.. తండ్రి చివరి జ్ఞాపకంగా మిగిలిన మనం సెట్ అగ్నికి ఆహుతైంది.. కొడుకు అఖిల్ను హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న హలోకి పేరైతే వచ్చింది కానీ.. వసూళ్లు లేవు.. ఇలాంటి పరిస్థితుల్లో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆయనకు భారత ప్రభుత్వం షాకిచ్చింది. నాగార్జున ఆధ్వర్యంలో నడుస్తోన్న అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లైసెన్స్ను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశీయ, విదేశీ సంస్థల నుంచి విరాళాలు అందుకుంటున్న ఎన్జీవోలు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఇప్పటికీ ఐటీ రిటర్న్స్ సమర్పించని సంస్థలపై కేంద్రప్రభుత్వం కొరడా ఝలిపించింది. ఐటీ రిటర్న్స్ సమర్పించని పలు ఎన్జీవో సంస్థలను గుర్తించామని.. వాటి లైసెన్స్లు రద్దు చేస్తున్నట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్కు తెలిపారు. ఈ లిస్ట్లో తెలంగాణ నుంచి 190, ఏపీ నుంచి 450 సంస్థలున్నాయి. వాటిలో అక్కినేని ఫౌండేషన్ కూడా ఒకటి. దివంగత మహానాటుడు అక్కినేని నాగేశ్వరరావు స్మారకార్థం ఆయన పేరిట అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్థాపించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది అక్కినేని కుటుంబం. ఈ ట్రస్టు వ్యవహారాలను నాగార్జున ఆయన భార్య అమల పర్యవేక్షిస్తున్నారు. తాజాగా లైసెన్స్ రద్దు కావడంతో నాగ్ తన పరపతిని ఉపయోగించి అక్కినేని ఫౌండేషన్ను తిరిగి నడిపిస్తారా అని ఫిలింనగర్లో జోరుగా చర్చించుకుంటున్నారు.
Also Read