ఆ రోజున నలుగురు కొట్టుకోబోతున్నారు!
on Oct 28, 2017
రాబోతున్న సమ్మర్ ఆసక్తికరంగా మారబోతోంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే రోజున అంటే... ఏప్రిల్ 27న సినిమాలను విడుదల చేస్తూ యుద్ధానికి శంఖం పూరించేశారు. పైగా ఇది ఇద్దరు హీరోల యుద్ధం మాత్రమే కాదు. ఇద్దరు రచయితల యుద్ధం కూడా. ఆ రచయితలే ఈ చిత్రాలకు దర్శకులు కూడా కావడం విశేషం. ఇంతకీ ఆ హీరోలు ఎవరు? ఆ దర్శకులు ఎవరు? అనేది తెలుసుకోవాలంటే... కొంచెం ముందుకెళ్లాలి. ఆ హీరోల్లో ఒకడు ‘మహేశ్ బాబు’. ఆయన కథానాయకునిగా నటిస్తున్న ‘భరత్ అను నేను’ చిత్రం సమ్మర్లో ఏప్రిల్ 27న విడుదల చేయాలని నిశ్చయించారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడన్న విషయం తెలిసిందే. నిజానికి ‘భరత్ అను నేను’ చిత్రానికి రాబోతున్న సంక్రాంతికే విడుదల చేయాలనుకున్నారు. కానీ.. సినిమా నిర్మాణంలో జాప్యం జరగడంతో సమ్మర్ కి పోస్ట్ పోన్ అయ్యింది.
ఇక మహేశ్ తో యుద్ధానికి ‘సై’ అన్న రెండో స్టార్ హీరో ఎవరో చెప్పనేలేదు కదూ.. ‘అల్లు అర్జున్’. అతను హీరోగా నటిస్తున్న ‘నా పేరు సూర్య.. నా ఊరు ఇండియా’ సినిమా కూడా అదే రోజున విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ద్వారా వక్కంతం వంశీ దర్శకునిగా పరిచయం అవుతుండటం విశేషం. రాబోతున్న పోరాటం... మహేశ్, బన్నీలకు మాత్రమే కాదు.. కొరటాల శివ, వక్కంతం వంశీలకు కూడా. ఈ సినిమా పేర్లలో కూడా పోలికలు ఉండటం విశేషం. మరి ఈ పోటీలో గెలుపెవరిదో కాలమే చెప్పాలి.