మహేశ్ చేసిన నష్టాన్ని.. ఎన్టీయార్ పూడుస్తాడట!
on Oct 8, 2017
‘స్పైడర్’ ఎవరెవరికి ఎంత నష్టాలను మిగిల్చిందో తెలీదు కానీ... దిల్ రాజు జేబుకి మాత్రం భారీగానే చిల్లు పెట్టింది. ఈ సినిమా నైజాం రైట్స్ ని 24 కోట్లకు కొన్నాడు దిల్ రాజు. పరిస్థితి బట్టి చూస్తుంటే... 14 కోట్లు రావడం కూడా గగనంలా కనిపిస్తుంది. అంటే... దాదాపు పది కోట్లు నష్టం అన్నమాట. శతమానం భవతి, నేను లోకల్, ఫిదా విజయాలతో నిర్మాతగా మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించిన రాజుకు ‘దువ్వాడ జగన్నాథం’ కొంత నష్టాలను మిగిలిస్తే... కేవలం ఒక్క నైజాం కొన్న పాపానికి పది కోట్లకు పైగా నష్టపోయాడు దిల్ రాజు.
రానున్న రవితేజా ‘రాజా ది గ్రేట్’, నాని ‘ఎంసీఏ’ చిత్రాలు హిట్ అయితే.. దిల్ రాజు ఈ బాధను మరిచిపోయే అవకాశం ఉంది. ఇదిలావుంటే.. రాజుగారు మరో.. పెద్ద ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టనున్నట్లు ఫిలింనగర్ టాక్. ఆల్రెడీ.. శంకర్, కమల్ కాంబినేషన్లో ‘భారతీయుడు 2’ నిర్మించిడానికి ఆయన సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనితో పాటు.. తెలుగులో ఓ భారీ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇంతకీ కథానాయకుడు ఎవరో చెప్పనేలేదు కదూ! ఎవరో కాదు... యంగ్ టైగర్ ఎన్టీయార్. కథ కూడా వినేయడం జరిగిందట. ఫిలింనగర్ లో వినిపిస్తున్న ఈ వార్తలో నిజం ఎంతో తెలియాలంటే... ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.