‘స్పైడర్’ ఇండియా రికార్డ్
on Oct 6, 2017
మొహెంజదారో, బాంబే వెల్వెట్... భారతీయ చలనచిత్ర చరిత్రలో భారీ బడ్జెట్ తో రూపొంది.. అతి దారుణమైన పరాజయాలుగా నిలిచిన చిత్రాలు. వీటి కారణంగా బయ్యర్లకు వందకోట్ల పైగానే నష్టాలు వాటిల్లాయ్. త్వరలో వీటి సరసన మరో సినిమా చేరబోతోంది. అయితే... అది బాలీవుడ్ సినిమా కాదు. తెలుగు సినిమా. ఆ సినిమా ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్.. అవును... ‘స్పైడర్’.
125 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందింది. దాదాపుగా 150 కోట్లకు అమ్మారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి... ఈ సినిమాకు బయ్యర్లు భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. దాదాపు 75 కోట్ల వరకూ బయ్యర్లకు నష్టం వాటిల్లేలా కనిపిస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ హీరో అవ్వడం, దక్షిణాదిలోనే మంచి పేరున్న మురుగదాస్ దర్శకుడు అవ్వడం.. ఈ కారణాలను దృష్టిలో పెట్టుకొని సినిమాకు భారీగానే ఖర్చు చేశారు. అందుకు తగ్గట్టే అమ్మారు. కానీ... నిర్మాతల లెక్కలు తారుమారయ్యాయ్. మొత్తంగా దేశంలోనే భారీ డిజాస్టర్లలో ఈ చిత్రం కూడా ఒకటని విశ్లేషకులు తేల్చేస్తున్నారు.
ఇదిలావుంటే... మహేశ్ మాత్రం ప్రస్తుతం ఇటలీలోని టుస్కానీ టూర్లో బిజీగా ఉన్నాడు. మొదట్నుంచీ మహేశ్ ది చిత్రమైన మనస్తత్వం. పరాజయాన్ని భరించలేడు. అందుకే... ఈ ప్రభావం కుటుంబంపై పడకుండా ఉండటానికే అన్నట్టు టుస్కానీ టూర్ కి వెళ్లిపోయాడు. అక్కడ తన భార్యాపిల్లలు ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోల్లో మహేశ్ లేకపోవడం గమనార్హం.
రేపు ‘స్పైడర్’ సెగ నిర్మాతలతో పాటు, మహేశ్ కి కూడా తగిలే అవకాశం ఉంది. మరి ఈ వ్యవహారాన్ని ఏ విధంగా సూపర్ స్టార్ చక్కదిద్దుతారో చూడాలి.