‘పైసా వసూల్’ లో పూరీ మెరిసిన సందర్భాలు!
on Sep 2, 2017
ప్రతి దర్శకునికీ ఓ స్టైల్ ఉంటుంది. సినిమా అంతా ఎలా తీసినా.. కొన్ని కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఆ స్టైల్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆ సీన్ చూడగానే.. ఇది ఫలానా దర్శకుడి సినిమా అని చెప్పొయచ్చు. అలా ప్రత్యేకమైన ఓ బాణిని ఏర్పాటు చేసుకున్న దర్శకుల్లో పూరీజగన్నాథ్ ఒకడు. పూరీ సినిమా అంటే... కథ, కథనం.. పాత్రల యాటిడ్యూడ్ అంతా... భిన్నంగా ఉంటుంది. ఆ మాటకొస్తే పూరీ సినిమా కలరే పెక్యులర్ గా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల చిత్రీకరణలో అయితే... పూరీ చలరేగిపోతారు. ఆయన గత సినిమాలను ఒక్కసారి చూస్తే అదెంత కరెక్టో అర్థమవుతుంది. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘పైసా వసూల్’ సినిమా.. పాజిటీవ్ టాక్ తో దూసుకెళ్తోంది. మరి ఈ సినిమాలో పూరీ ఎక్కడెక్కడ మెరిశాడు? ఎక్కడెక్కడ అదరహో అనిపించాడో తెలియాలంటే... ఇక చదవండి. మామూలుగా విడుదలకు ముందే ట్రైలర్స్ లో హీరో ఇంట్రడక్షన్ సీన్ ని చూపించడం సంప్రదాయం కాదు. కానీ.. ఇందులో ట్రైలర్లో అందరూ చూసిన షాట్ తోనే బాలయ్య ఎంటరవ్వడం విస్మయానికి గురి చేస్తుంది. అంటే.. ‘అదిరిపోవాల్సింది ఇంట్రడక్షన్ కాదు.. సినిమా’ అని సినిమా ద్వారా చెప్పకనే చెప్పాడు పూరీ. ‘పైసా వసూల్’లో ఫైట్ కి ముందు బాలయ్య చెప్పిన ప్రతి డైలాగూ థియేటర్లో అరుపులు పుట్టించేసింది. ముఖ్యంగా ఇంట్రవెల్ బ్యాంగ్. ఆ సన్నివేశంలో బాలయ్య పెర్ ఫార్మెన్స్ అదుర్స్. అక్కడున్న గూండాలందరికీ ఛాయిస్ ఇస్తూ... రైల్వేస్టేషన్ ప్లాట్ ఫాం మీద బాలయ్య చెప్పే డైలాగు ఈ సినిమాకే హైలైట్. అసలు ఆ సన్నివేశమే సినిమాకు హార్ట్. చివరకు హీరోయిన్ షూట్ చేసిన బుల్లెట్ గుండెల్లోకి దిగితే... ఏ మాత్రం బెదరకుండా, బాధ లేకుండా... అలా స్టైల్ గా ఛైర్ లో కూర్చొని.. బాలయ్య చెప్పే డైలాగులు ఆడియన్స్ లో వైబ్రేషన్ పుట్టిస్తాయ్. ఇది కచ్చితంగా పూరీ తన కోసం, దర్శకునిగా తన ఆత్మ సంతృప్తి కోసం తీసుకున్న సన్నివేశం అని చెప్పకతప్పదు.
సెకండాఫ్ కథలోకి ఎంటరయ్యాక.. సినిమా నడకలో వేగం తగ్గిన మాట నిజమే కానీ.. శ్రియ ఎపిసోడ్ యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. అలాగే... బాలయ్య, శ్రియలపై చిత్రీకరించిన ‘కన్ను కన్ను కలిశాయి’ మెలొడీ సాంగ్.. క్లాస్ ఆడియన్లను సైతం కట్టి పడేస్తుంది. ఈ పాటను చాలా స్టైలిష్ గా తీశాడు పూరీ. ఈ పాటలో కూడా పూరీ మార్క్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎమోషనల్ గా సాగుతున్న సన్నివేశంలో కామెడీని పుట్టించడం పూరీ స్టైల్. అలాంటి సీన్స్ సినిమాలో ఆద్యంతం కనిపిస్తాయ్. విలన్ ని చంపే సీన్ నిజానికి చాలా సీరియస్ సీన్. కానీ... అందులో విలన్ భయంలోంచి కామెడీని సృష్టించాడు పూరీ. ‘ఏంట్రా... ఏంట్రా నువ్విలా ఉన్నావ్...’ అని విలన్ వణికిపోతూ అడుగుతుంటే.. ‘వన్స్ నాకు స్ర్కూ లూజైతే... నేనిలాగే ఉంటా’ అని వాడ్ని చంపే సీన్. ఇది కూడా పూరీ మెరిసిన సన్నివేశమే. రౌడీలు తలపై కొట్టగానే... అసలే మందులో ఉన్న బాలయ్యకి మొత్తం బ్లర్ అవుతుంది. ఇద్దరిద్దరు కనిపిస్తుంటారు. దాంతో... ఆ బ్లర్ లోనే వాళ్లు కొట్టేస్తాడు. ‘ఇది నువ్వు... ఇది బ్లర్... ఇది నువ్వు... ఇది బ్లర్’ అంటూ మత్తులో మనిషినే కాక, మనిషి బ్లర్ ని కూడా కొట్టే సీన్ అయితే... ప్రేక్షకులు విరగబడి నవ్వుతున్నారు.
ఈ సినిమాలో పూరీ చేసిన మరో మేజిక్ స్క్రీన్ ప్లే. ఇప్పటివరకూ క్లైమాక్స్ లో విలన్ ని హీరో చంపడమే మనం చూశాం. కానీ.. ఈ సినిమా హీరో విలన్ ని ఆల్రెడీ చంపేసే ఎంటరవుతాడు. కథ నడుస్తున్నప్పుడు విలన్ చనిపోయే ఉంటాడు. ‘వాడ్ని ఎప్పుడో చంపేశాను’ అని క్లైమాక్స్ లో చెబుతాడు. ఇది వినూత్న ప్రయత్నం. సినిమాలో ఇలాంటి సన్నివేశాలే కోకొల్లున్నాయ్. యువతరానికీ... ఫ్యాన్స్ కీ ఇవి చాలు ఎంజాయ్ చేయడానికి. ఏది ఏమైనా... 23 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హిట్ తర్వాత వెంటనే మరో హిట్ ఇచ్చాడు బాలయ్య. 1993 చివర్లో ‘బంగారు బుల్లోడు‘ సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత 1994 ప్రధమార్థంలో ‘భైరవద్వీపం’తో వెంటనే మరో హిట్ ఇచ్చాడు బాలయ్య. మళ్లీ ఇన్నాళ్లకు ఆ ఫీట్ రిపీట్ అయ్యింది. ఇది ఫ్యాన్స్ నిజంగా పండుగ చేసుకోవాల్సిన తరుణం. ఈ విషయంలో అందరూ పూరీ జగన్నాథ్ కి థ్యాంక్స్ చెప్పేయండి.