సినిమా రాకముందే రచ్చ మొదలు
on Jul 29, 2017
రానా కథానాయకునిగా తేజా తీసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా తమిళనాట పెద్ద చర్చకే దారి తీసింది. ‘నాన్ అనై విట్టాల్’పేరుతో ఈ చిత్రాన్ని తమిళం కూడా విడుదల చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన తమిళ ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. ఆ ట్రైలరే... ప్రస్తుతం తమిళ నాట రచ్చకు కారణమైంది. ఇంతకీ అందులో ఏముంది? అనేగా మీ డౌట్. ఆ సినిమా కోసం దర్శకుడు తేజా రాసుకున్న ‘వంద మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి రిసార్ట్స్ లో పడేస్తే... సాయంత్రానికి నేనూ అవుతా... ముఖ్యమంత్రి’ అనే డైలాగే తమిళ నాట పెద్ద దుమారమే లేపింది. మొన్నటి వరకూ తమిళ రాజకీయాలన్ని రిసార్ట్ష్ చుట్టూనే తిరిగిన విషయం తెలిసిందే.
ఆ ఉదాంతాన్ని వేలెత్తి చూపిస్తూ ఈ డైలాగ్ రాసుంటారని అక్కడి ఓ వర్గం భావన. దాంతో ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ వేడుకలో దర్శకుడు తేజా ఈ విషయంపై వివరణ ఇచ్చారు. ‘నిజానికి ఆ డైలాగ్ ఇప్పుడు రాసింది కాదు. ఎప్పుడో రాసుకున్న డైలాగ్ అది. మా రాష్ట్రంలోనే ఎమ్మెల్యేలను దాచేసి ముఖ్యమంత్రి అయిన ఉదాంతం జరిగింది. సో... మాకు తమిళ రాజకీయాలను టార్గెట్ చేయాల్సిన పనిలేదు. అయితే... ఆ డైలాగ్ లో ‘రిసార్ట్స్ స్థానంలో ఫస్ట్ ఉండాల్సింది ‘హోటల్’. అయితే... ‘రిసార్ట్ష్’ అని పెడితే బావుంటుందని కొందరు చెప్పడంతో మార్చడం జరిగింది’ అని చెప్పుకొచ్చారు తేజ. సినిమా రాకముందే తమిళ తంబీలు ఇంత చేస్తే... రేపు విడుదలయ్యాక ఇంకెంత రచ్చ చేస్తారో అని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు.