చిరంజీవి దగ్గరకు ‘సైరా’ పంచాయితి!
on Nov 13, 2017
గాడిద పని గాడిద చేయాలి. గుర్రం పని గుర్రం చేయాలి. కానీ ప్రస్తుతం అలా జరగడం లేదు. గాడిదలన్నీ గుర్రాలనుకుంటున్నాయ్. గుర్రాలేమో గాడిదలైపోతున్నాయ్. తుదకు ప్రాజెక్టుకు దెబ్బడిపోతోంది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో జరుగుతున్న తతంగం అదే. విషయపరిజ్ఙానం లేని వారిని కెప్టెన్ గా కూర్చోబెడతారు. చుట్టూ మేధావులు కూర్చుంటారు. వాళ్లు ఏం చెప్పినా.. ఈయనగారికి ఎక్కదు. మిడిమిడి జ్ఙానంతో కెప్టెన్ గారు చెప్పేవేమో.. వీళ్లకు మింగుడు పడవ్. ‘చూడు బాబూ... విషయం ఇది’ అని చెప్పారనుకోండీ.. ‘ఇది నాకే అర్థం కాలేదు.. ఇక జనానికైం అర్థమవుతుంది’ .. అంటారు కెప్టెన్ గారు. ఆవ్విధముగా.. పదికోట్ల తెలుగువారందరూ సన్నాసులు(తనలాగే) అని తన అనుమానంతో రూఢీ చేస్తారు.
తెలిసిన వారికేమో ఓర్పు ఉండదు. కెప్టెన్ కేమో.. విని తెలుసుకోవాలనే జిజ్ఙాస ఉండదు. చివరకు స్క్రిప్ట్ అంతా కంగాళీ కంగాళీ అవుతుంది. అదేంటని నిర్మాత అడిగితే... గుడ్డకాల్చి మంచి చెప్పజూసిన మేధావులపై వేస్తారు కెప్టెన్ గారు. చిత్ర పరిశ్రమలో పెద్ద పెద్ద సినిమాల విషయంలో జరుగుతున్న తతంగం ఇదంతా. చిరంజీవి ‘సైరా’ సినిమా విషయంలో కూడా ఇలాంటి గొడవే ఒకటి జరుగుతోందట. అది చిరంజీవి దాకా వచ్చింది. స్క్రిప్ట్ సరిగ్గా రాకపోవడంతో... ఇదేంటని చిరంజీవి అడిగితే... ‘మేం నిమిత్తమాత్రులం మహప్రభో. అంతా దర్శకులవారి చలువ’ అనేశారట ముగ్గురు రచయితలు. ‘ఇదేం పనయ్యా రెడ్డీ’ అని కెప్టెన్ గారిని అడిగితే...‘నా మేధా శక్తిని అందుకోలేకపోవడం రచయితల తప్పు’ అని తప్పంతా రచయితలకు చుడుతున్నాడట. చివరకు అడకత్తెరలో పోకచెక్క మదిరిగా తయారైందట చిరంజీవి పరిస్థితి.
కానీ.. బయట ప్రచారం మరో రకంగా కూడా వినిపిస్తోంది. రచయితల్లో ఒకరిపై ఒకరికి ఇగో ప్రాబ్లమ్స్ వచ్చాయని, అది స్క్రిప్ట్ పై ప్రభావం చూపిందని ఓ గాసిప్ వెలుగులో ఉంది. అయితే... దగ్గరవాళ్లను అడిగితే... అసలు విషయం ఇదని చెబుతున్నారు. రచయితలు ముగ్గరూ చాలా అసంతృప్తితో ఉన్నారని సమాచారం. దర్శకుడి పనేంటంటే... తనకు ఏం కావాలో చెప్పడం. దానికి తగ్గట్టు రాయడం రచయితల పని. దర్శకుడు రాతకూతల్లో వేలుపెట్టినా... రచయితలు డైరెక్షన్లో కాళ్లు పెట్టినా సినిమా కొండెక్కిపోతుంది. చివరకకు చెప్పేదేంటంటే... నేటి యువదర్శకులు... ‘మాకే తెలీదు... ఇక జనానికేం తెలుస్తుందండీ’ అనే మాట మాత్రం విడిచిపెట్టాలి. ఎందుకంటే.. ఇప్పటికీ.. ఎప్పటికీ.. జనానికి తెలిసినంత మీలో ఎవ్వరికీ తెలీదు. అది గుర్తుంచుకోండి.