మహేశ్ మీద నోరు జారాడు... ఇప్పడు నీళ్లు నములుతున్నాడు!
on Sep 15, 2018
'పెదవి దాటని మాటకు ప్రభువు నీవు. పెదవి దాటిన మాటకు బానిస నీవు'... పెద్దలు ఎప్పుడో చెప్పిన జీవిత సత్యాల్లో ఇదీ ఒకటి! దీని అర్థం ఏంటంటే... నోరు జారితే వెనక్కి తీసుకోలేమని, ఆ మాటలకు బానిసగా వుండాలని! అందుకని నోరు అదుపులో పెట్టుకోమంటారు. ఒకవేళ అదుపులో పెట్టుకోకపోతే ఏం జరుగుతుందో? తమిళ్ స్టాండప్ కమెడియన్ మనోజ్ ప్రభాకర్కి బాగా తెలుస్తుంది. నలుగుర్ని నవ్వించడం కోసం మహేశ్బాబును నానా మాటలూ అన్నాడు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో తన చిత్తానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. వినాయక చవితికి ముందు జరిగిన ఆ కార్యక్రమం ఆలస్యంగా తెలుగు జనాలకు చేరువైంది. మహేశ్ మీద మనోజ్ ప్రభాకర్ పేల్చిన చిల్లర జోకులకు తెలుగు ప్రేక్షకులు, అభిమానులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.
- మహేశ్ని, కత్రినా కైఫ్ని పక్క పక్కన పెడితే... కత్రీనాకు మహేశ్ మేల్ వెర్షన్లా వుంటాడు.
- మహేశ్ని అందరూ రాక్స్టార్ అని ఎందుకంటారో తెలుసా?
అతడి ఫేస్ రాక్ (రాయి)లా వుంటుంది కాబట్టి.
- మహేశ్కి అసలు నటన రాదు.
'స్పైడర్'లో ఎస్జే సూర్య అద్భుతంగా నటిస్తే మహేశ్ మాత్రం రాయిలా వున్నాడు.
వీటితో పాటు మరికొన్ని కామెంట్స్ చేశాడు. స్క్రీన్ మీద రెండురాళ్లను చూపించి మహేశ్ నటనను వాటితో పోల్చాడు. మనోజ్ ప్రభాకర్ చిల్లర కామెడీకి మహేశ్ అభిమానులు హర్ట్ అయ్యారు. దాంతో మనోజ్ ప్రభాకర్ని టార్గెట్ చేస్తూ ట్విట్టర్, పేస్బుక్లో ట్రోల్ చేస్తున్నారు. కేవలం మహేశ్ అభిమానులు మాత్రమే కాదు... సినిమా ప్రేక్షకులు కూడా అతణ్ని ఓ ఆట ఆడుకుంటున్నారు. తెలుగు ప్రేక్షకుల దెబ్బకు అతడు విలవిలమంటున్నాడు. క్షమించమని వేడుకుంటున్నాడు. అయినా అభిమానులు వెనకడుగు వేయడం లేదు. దాంతో మరోసారి మనోజ్ ప్రభాకర్ సారీ చెప్పాడు. మహేశ్ మీద వ్యక్తిగతంగా తనకు ఎటువంటి వైరం లేదని, అతడికి తాను వ్యతిరేకం కాదని చెప్పాడు. ట్రోలింగ్ ఆపేయమని ఇన్డైరెక్టుగా అభ్యర్ధించాడు.