వెంకటేష్ నుండి రవితేజ దగ్గరకు వచ్చారా?
on Nov 5, 2019
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కథలు మారడం కొత్త ఏమీ కాదు. ఓ హీరో చేయాల్సిన కథ మరో హీరో దగ్గరకు వెళ్లడం వెరీ కామన్. హీరోలు మారిన సినిమాలు చాలా ఉన్నాయి. ఈ జాబితాలో దర్శకుడు త్రినాథరావు నక్కిన, రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ తాజా సినిమా కూడా చేరుతుందని ఫిలింనగర్ టాక్. 'సినిమా చూపిస్త మావ', 'నేను లోకల్', 'హలో గురు ప్రేమ కోసమే' సినిమాలతో త్రినాథరావు-ప్రసన్న జోడి హిట్ పెయిర్ అనిపించుకున్నారు. 'హలో గురు ప్రేమ కోసమే' తర్వాత విక్టరీ వెంకటేష్ దగ్గరకు వెళ్లారు. ఆయన కోసం ఓ కథ రెడీ చేశారు. కొన్ని నెలల పాటు హీరోతో చర్చలు జరిగాయి. కానీ, గ్రీన్ సిగ్నల్ రాలేదు. తమిళ హిట్ 'అసురన్'కు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళంలో ధనుష్ పోషించిన పాత్రను తెలుగులో ఆయన చేయనున్నారు. దీంతో వెంకటేష్ దగ్గర నుండి రవితేజ దగ్గరకు త్రినాథరావు-ప్రసన్న వెళ్లారట. మాస్ మహారాజా తలుపు తట్టారట. కమర్షియల్ మీటర్లో ఫుల్ కామెడీతో కూడిన స్క్రిప్ట్ కావడంతో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం 'డిస్కో రాజా' చేస్తున్న మాస్ మహారాజా, తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఆ తర్వాత త్రినాథరావు నక్కిన సినిమా చేస్తారేమో.