వర్మ ఎన్టీఆర్ కోసం దేవుడ్ని ప్రార్థించారట.. ఇదేం ట్విస్ట్.!!
on Oct 19, 2018
రామ్ గోపాల్ వర్మ ఈ పేరు వింటేనే ప్రతిభతో కూడిన మూర్ఖత్వం గుర్తొస్తుంది. తొలిసినిమా శివతోనే ఎన్నో సంచలనాలు సృష్టించిన వర్మ.. దాని తరువాత కూడా పలు సినిమాలతో ఆకట్టుకున్నాడు. తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే తరువాత తరువాత ఆ బ్రాండ్ ని దూరం చేసుకున్నాడు. ఒకప్పుడు వర్మ సినిమా!! అని ఆసక్తి కనబరిచిన వారు కూడా ఇప్పుడు వర్మ సినిమానేగా అంటున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ వర్మ ప్రేక్షకుల దృష్టిని తనవైపు మరలేలా చూసుకుంటున్నాడు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే సినిమాని వర్మ ప్రకటించి తరువాత సైలెంట్ అయ్యాడు. దీంతో ఈ సినిమా కూడా టైం పాస్ గా అనౌన్స్ చేసుంటాడు అనుకున్నారంతా. కానీ కాస్త గ్యాప్ తీసుకొని మరీ సినిమా ఓపెనింగ్, ఆర్టిస్ట్ ల ఎంపిక అంటూ హడావిడి మొదలుపెట్టారు. అంతేకాదు ఈ సినిమా కోసం వర్మ ఏకంగా తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. వెంకన్నను సినిమా కోసం ప్రార్థించారట కూడా.
ఎక్కువగా హార్రర్, ఫ్యాక్షన్, మాఫియా సినిమాలు చేసే వర్మకు దేవుడిపై నమ్మకం ఉందంటే నమ్మలేం. ఈ విషయం ఆయన మాటల్లో కూడా అర్ధమవుతుంది. ఎప్పుడో 'గోవిందా గోవిందా' అంటూ ఓ సినిమా చేసారు. ఆ మధ్య షూటింగ్ సమయంలో లొకేషన్ లో ఉన్న వినాయక విగ్రహం పక్కన నిల్చొని ఫోటోకి పోజ్ ఇచ్చారు. అయితే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కోసం ఏకంగా భక్తుడి అవతారమే ఎత్తారు. తాజాగా వర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను పుట్టినప్పట్నుంచి ఇప్పటి వరకూ దేవుడిని దర్శించుకోలేదన్నారు. కేవలం ఎన్టీఆర్పై ఉన్న గౌరవంతోనే నేడు తిరులమ వెంకన్నను దర్శించుకున్నట్లు తెలిపారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో నిజాలను ప్రజలకు అందించే ప్రయత్నాన్ని విజయవంతం చేయమని ప్రార్థించామన్నారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీలో నమ్మలేని ఎమోషన్స్ ఉంటాయన్నారు. వాటిని చూపించే ధైర్యం, సాహసం, శక్తి ఇవ్వమని వెంకన్నను ప్రార్థించానన్నారు. ఈ చిత్రం మనస్సుతో చేయాల్సిన చిత్రమని వర్మ అన్నారు.