నయనతార హిందువులు మనోభావాలు కించపరిస్తే?
on Nov 12, 2019
నయనతార కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే చిక్కులు మొదలయ్యేలా తమిళనాడులో వాతావరణం వేడెక్కింది. రేడియో జాకీ నుండి కమెడియన్గా, తర్వాత 'ఎల్.కె.జి' సినిమాతో హీరోగా మారిన ఆర్జే బాలాజీ, నయనతార ప్రధాన పాత్రలో నటించనున్న 'మూకుత్తి అమ్మన్'తో దర్శకుడిగా మారనున్నారు. రెండు రోజుల క్రితం సినిమాను ప్రకటించారు. 2020 సమ్మర్లో విడుదల చేస్తామని తెలిపారు. అమ్మన్ అంటే 'అమ్మవారు'. మూకుత్తి అంటే 'ముక్కుపుడక ఉన్న' అని అర్థం. టైటిల్ (ముక్కుపుడక ఉన్న అమ్మవారు)ను బట్టి ఇదొక భక్తి సినిమా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ప్రజల్లో ఉన్న భక్తిపై తీస్తున్న సెటైరికల్ కామెడీ అట.
నయనతార జన్మతః క్రిస్టియన్. ప్రభుదేవాను ప్రేమించిన సమయంలో హిందూ మతంలోకి మారారు. మరి, ప్రభుదేవాతో ప్రేమ పెటాకులు అయినప్పుడు మళ్లీ క్రిస్టియానిటీలోకి వెళ్లారో? లేదో? తెలియదు. కానీ, తెలుగులో నందమూరి బాలకృష్ణ రాముడిగా బాపు దర్శకత్వం వహించిన 'శ్రీరామరాజ్యం'లో సీతగా నటించారు. ఆమె అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ఎవరి మనోభావాలు దెబ్బతినలేదు. భక్తిపై సెటైరికల్ సినిమా అంటే మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో సెంటిమెంట్స్ ఎక్కువ. తమ మనోభావాలను నయనతార కించపరిచారని ప్రజలు, ప్రేక్షకులు తిరగబడితే, ఆమె లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ కి తూట్లు పడటం ఖాయమే. అసలు, సినిమా ఎలా ఉంటుందోనని ఇప్పటి నుండి ఓ వర్గం ప్రేక్షకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. అనుమానంతో 'పద్మావత్' సెట్స్ తగలబెట్టిన చరిత్ర ఉన్న దేశం మనది.
Also Read