పాపం.. వర్మ ట్రిక్కులు పని చేయట్లేదు!
on Nov 21, 2018
జయాపజయాలతో సంబంధం లేకుండా తన ప్రతి సినిమాకూ ప్రేక్షకుల్లో క్రేజ్ తీసుకురావడంలో దర్శకుడు రామ్గోపాల్ వర్మ దిట్ట. ప్రతిసారి ఏదో మాయ చేస్తుంటారు. ఈసారి ఆయన మాయలు, మంత్రాలు, ట్రిక్కులు పని చేయట్లేదు. కన్నడ నటుడు ధనుంజయ్ హీరోగా వర్మ నిర్మించిన సినిమా 'భైరవగీత'. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని సిద్ధార్థ్ తాతోలు దర్శకత్వం వహించిన ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ప్రేమకథగా తెరకెక్కింది. పోస్టర్లు, ట్రైలర్లు విడుదల చేసినప్పుడు ప్రేక్షకుల దృష్టిని సినిమా ఆకర్షించింది. అప్పుడు నవంబర్ 22న విడుదల చేస్తామని ప్రకటించారు. తరవాత విడుదల తేదీని నవంబర్ 30కి మార్చారు. అప్పటినుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గింది. మీడియాలో కూడా. '2.ఓ' ముందు 'భైరవగీత'ను ఎవరూ పట్టించుకోవడం లేదు. నవంబర్ 29న రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన '2.ఓ' విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా క్రేజ్ ముందు 'భైరవగీత' కనిపించడం లేదు. అక్కడికీ '2.ఓ' వర్సెస్ 'భైరవగీత' అంటూ వర్మ ట్వీట్లు చేశారు. కానీ, ప్రతిసారీ వర్మ ట్వీట్లకు మీడియాలో ప్రచారం లభించినట్టు లభించలేదు. ఈ సినిమాకు వీలైనంత ప్రచారం కల్పించడం కోసం వర్మ తీవ్రంగా కృషి చేస్తున్నారు.