మెహరీన్... సిని'మా' పంచాయితీ!
on Dec 15, 2018
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిలో హీరోయిన్ మెహరీన్పై ఖుషి అనే నిర్మాత ఫిర్యాదు చేశారు. తాను ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వడం లేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఖుషి వైఖరిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)ను ఆశ్రయించారు మెహరీన్. ఎందుకంటే... ఖుషి నిర్మించబోయే సినిమా కోసం మెహరీన్ డేట్స్ కేటాయించారు. మరో రెండు సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చినా.. వాటిని పక్కన పెట్టారు. తన డేట్స్ వేస్ట్ అవుతున్నాయని, అందుకు తగిన న్యాయం చేయాలనేది మెహరీన్ వాదన. సిని'మా' పెద్దలు తనను అడ్వాన్స్ తిరిగి ఇవ్వమంటే.. అందుకు తాను సిద్ధమని మెహరీన్ తెలిపారట. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? అంటే... సుధీర్ బాబు హీరోగా పులి వాసు దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఖుషి ఓ నిర్మాత ప్రారంభించారు. అందులో మెహరీన్ని హీరోయిన్గా తీసుకున్నారు. పూజా కార్యక్రమాలకు సుధీర్ బాబు, మెహరీన్... ఇద్దరూ హాజరయ్యారు. ఏమైందో ఏమో... సుధీర్ బాబుతో కాకుండా చిరంజీవి రెండో అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. అందులో మెహరీన్ని కాకుండా మరొకర్ని హీరోయిన్గా తీసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకని, ఆమెను అడ్వాన్స్ తిరిగి ఇవ్వమన్నారు. తన డేట్స్ వేస్ట్ అవుతున్న కారణంగా అడ్వాన్స్ ఎందుకు తిరిగి ఇవ్వాలనేది మెహరీన్ వాదన. చివరకు, ఈ పంచాయతీ సినిమా పెద్దల దగ్గరకు చేరింది. వారు ఏం తీర్పు ఇస్తారో??