దత్త పుత్రికను కుటుంబంలోకి ఆహ్వానించిన మందిరా బేడీ
on Oct 26, 2020
దసరా పండగ పర్వదినాన తమ దత్త పుత్రికకు బాలీవుడ్ నటి, టీవీ ప్రజెంటర్ మందిరా బేడీ నామకరణం చేశారు. జూలై నెలలో మందిరా బేడీ, ఆమె భర్త రాజ్ కౌశల్ నాలుగేళ్ల చిన్నారిని దత్తత తీసుకున్నారు. ఆ పాపాయిని ఆదివారం కుటుంబంలోకి ఆహ్వానించారు. 'తారా బేడీ కౌశల్' అని పేరు పెట్టారు.
మందిరా బేడీ, రాజ్ కౌశల్ దంపతులకు తొమ్మిదేళ్ల కుమారుడు వీర్ ఉన్నాడు. రెండో సంతానంగా తారాను దత్తత తీసుకున్నారు. ఆదివారం ఫ్యామిలీలోకి ఆహ్వానించడంతో పాటు కుటుంబమంతా కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. "మా చిన్నారి కుమార్తె తారా, పైలోకాల నుండి ఆశీర్వాదంగా వచ్చింది. తన వీర్ కి చెల్లెలు. స్వచ్ఛమైన ప్రేమతో, నిండు మనసుతో ఇంటిలోకి ఆహ్వానిస్తున్నాం. 28, జూలై 2020 నుండి తారా బేడీ కౌశల్ మా ఫ్యామిలీలో ఓ భాగమైంది" అని మందిరా బేడీ పోస్ట్ చేశారు. పలువురు ప్రముఖులు బేడీ-కౌశల్ దంపతులకు విషెస్ చెప్పారు.