జస్ట్ మిస్... కమల్ & కాజల్
on Feb 20, 2020
నిజం నిలకడ మీద తెలుస్తుంది - పెద్దలు చెప్పిన మాట! సోషల్ మీడియా జమానాలో ఎవరికీ నిలకడ ఉండడం లేదు. నిలకడగా నిజం తెలిసేలోపు అబద్దాన్ని అందరికీ చెప్తున్నారు. ఆ తొందరే కొంపలు ముంచుతోంది. సోషల్ మీడియాలో సెలబ్రిటీలను చంపేస్తోంది. దర్శకుడు శంకర్ ను ఈ విధంగా కొందరు చెంపేస్తుంటే... మరికొందరు గాయాలు అయ్యాయని రాస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే... చెన్నై నగరశివార్లలోని ఒక ప్రాంతంలో 'ఇండియన్ 2' కోసం సెట్స్ వేస్తున్నారు. బుధవారం రాత్రి సెట్ వర్క్ జరుగుతుండగా ప్రమాదం సంభవించింది. భారీ క్రేన్ కింద పండింది. ఈ ప్రమాదంలో ఒక సహాయ దర్శకుడు, మరో ఇద్దరు మృతి చెందారు.
అయితే... ప్రమాదంలో దర్శకుడు శంకర్ కి తీవ్ర గాయాలు అయ్యాయని కొందరు ట్వీట్స్ చేశారు. అందులో నిజం లేదని యూనిట్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమా 'ఇండియన్'కి సీక్వెల్ ఈ 'ఇండియన్ 2'. తాజా సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సీక్వెల్ ను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. బుధవారం రాత్రి జరిగిన ప్రమాదం నుండి కమల్, కాజల్ తృటిలో బయటపడ్డారని కాస్ట్యూమ్ డిజైనర్ అమృతరామ్ ట్వీట్ చేశారు. క్రేన్ పడడానికి పది సెకన్స్ ముందు వరకు కమల్, కాజల్, తానూ అక్కడ ఉన్నామని ఆమె ట్వీట్ చేశారు. దానికి కాజల్ రిప్లై ఇచ్చారు. బాధపడుతున్న ఎమోజి పోస్ట్ చేశారు.