నా పనైపోయిందనుకున్నార్రా! : అనిరుధ్
on Apr 20, 2019
'జెర్సీ' చూసి ప్రేక్షకులు సంతోషించారు. మంచి సినిమా చూసామన్న సంతృప్తితో థియేటర్ నుంచి బయటకు వచ్చారు. సోషల్ మీడియాలో సినిమా పై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెట్టారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి స్టార్స్ కూడా 'జెర్సీ' సినిమా నచ్చిన అభిమానుల జాబితాలో ఉన్నారు. పరిశ్రమ ప్రముఖుల నుంచి ప్రేక్షకుల నుంచి సినిమాకు వస్తున్న స్పందన చూసి 'జెర్సీ' చిత్ర బృందం ఉబ్బి తబ్బిబ్బవుతోంది. అందులో అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉన్నది సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్. ఎందుకంటే... తెలుగులో అతడికి తొలి విజయం ఇది. గతేడాది సంక్రాంతికి విడుదలైన పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమాతో తెలుగు తెరకు సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచంద్రన్ పరిచయమయ్యాడు. అంతకు ముందు అతడు సంగీతం అందించిన పలు తమిళ సినిమాలు తెలుగులో అనువాదం అయ్యాయి. 'కొలవరి డి'తో పాటు అతను సంగీతం అందించిన చాలా పాటలు తెలుగు ప్రేక్షకులకు నచ్చాయి. అయితే... స్ట్రయిట్ తెలుగు సినిమా మాత్రం 'అజ్ఞాతవాసి'నే. అనూహ్యంగా ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేస్తూ సినిమా పరాజయం పాలైంది. అనిరుధ్ సంగీతంపైనా విమర్శలు వచ్చాయి. తెలుగులో కమర్షియల్ సినిమాలకు సంగీతం అందించ లేడని కొందరు కామెంట్ చేశారు. 'అజ్ఞాతవాసి' తర్వాత అనిరుధ్ సంగీతం అందించిన తెలుగు చిత్రం 'జెర్సీ'. హీరో నాని, హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్, దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో పాటు అనిరుద్ సంగీతానికి కూడా మంచి పేరు వచ్చింది. దాంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. సంతోషంతో పాటు అతడిలో గర్వం కూడా కనిపించింది. ప్రేక్షకుల ప్రశంసలు విమర్శకుల రివ్యూలు వచ్చిన తర్వాత అనిరుధ్ ఒక ట్వీట్ చేశాడు. "జెర్సీకి, జెర్సీ సంగీతానికి వస్తున్న రివ్యూలు, ప్రేక్షకుల కామెంట్స్ చదివాక.... మా స్టూడియో దగ్గర స్పందన ఇది" అంటూ 'పేట' సినిమాలో రజనీకాంత్ డైలాగ్ 'నా పనైపోయిందనుకున్నార్రా'ను ట్వీట్ చేశాడు అనిరుధ్.