పవన్... మళ్లీ అమ్ముడుపోతున్నావా?
on Feb 10, 2016
సరిగ్గా.. 2014 ఎన్నికల సమయంలో జనసేన పార్టీని స్థాపించి ఎంత షాకిచ్చాడో.. ఎన్నికల్లో పోటీ చేయడం లేదు అని చెప్పి అంతకంటే ఎక్కువ షాకిచ్చాడు పవన్ కల్యాణ్. ఇవి రెండూ తట్టుకొన్నవాళ్లు కూడా `నా మద్దతు చంద్రబాబుకే` అనడంతో కృంగిపోయారు. కేవలం టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకే పవన్ పార్టీ పెట్టాడని అప్పట్లో చెప్పుకొన్నారు. అంతేనా..?? పవన్ త్యాగానికి గుర్తింపుగా తన ఖాతాలో రూ.500 కోట్లు మళ్లాయన్న గుసగుసలూ వినిపించాయి. అలా.. పవన్ అమ్ముడుపోయాడేమో అన్న అనుమానాలు పెరిగిపోయాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
ప్రజలో, రైతులో, ఓ వర్గమో సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ల గురించి సానుకూలంగా స్పందించాల్సింది పోయి.. టీడీపీనీ చంద్రబాబు నాయుడు పనితీరుని వెనకేసుకొచ్చి.. ఆ అనుమానాల్ని మరింత పెంచేశాడు పవన్. మొన్నటికి మొన్న కాపు వివాదంలోనూ పవన్ తన తరపున చేసిందేం లేదు. చంద్రబాబు నాయుడు వెనుక నిలబడి... టీడీపీని మళ్లీ వెనకేసుకొచ్చాడు. ఇంత కష్టపడుతున్నవాడికి ఏదోలా సాయం చేద్దామన్న ఆలోచన ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చిందట. అందుకే ఇప్పుడు పవన్ కి కేంద్రమంత్రిపదవి దక్కడం ఖాయం అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే.. పవన్ మళ్లీ అమ్ముడుపోయాడన్న వార్తలు రావా?? దానికి తోడు.. జనసేనను టీడీపీలోకి విలీనం చేయబోతున్నట్టు కూడా చెప్పుకొంటున్నారు. పార్టీని నడపాలంటే, ఎన్నికల్లో దింపాలంటే.. బోల్డంత డబ్బు కావాలి.. అది నా దగ్గర లేదు.. అందుకే టీడీపీలో కలిపేస్తున్నా.. అంటూ కుంటిసాకులు చెప్పుకోవడానికి పవన్ రెడీగా స్ర్కిప్టు తయారు చేసుకొన్నాడని, దానికి బహుమతిగానే మంత్రి పదవి ఇస్తున్నారని.. గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే.. జరిగితే అమ్ముడుపోయాడన్న మాటలు అక్షరాలా నిజం అయిపోతాయి. కాదంటారా?? మరి ఈ హైడ్రామాకి ఎప్పుడు తెరలేస్తుందో చూడాలి.