దిల్రాజుకు మరో దెబ్బ
on Sep 14, 2018
గడచిన యేడాది దిల్రాజు పట్టిందల్లా బంగారమై. ఆరు సినిమాలు నిర్మిస్తే ఆరూ లాభాలు తీసుకొచ్చాయి. అంతా సంతోషంగా గడిచిందని చెప్పుకొచ్చారు. అందుకు పూర్తి విరుద్ధంగా ఈ యేడాది జరుగుతోంది. ఇటు నిర్మాతగా... అటు పంపిణీదారుడిగా... వరుస పరాజయాలను చవి చూస్తున్నారు. ఈ యేడాది సంక్రాంతికి విడుదలైన పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి'ని నైజాం ఏరియాలో ఆయనే విడుదల చేశారు. కనీస వసూళ్లు కూడా రాలేదు. పంపిణీ రంగాన్ని పక్కన పెడితే... నిర్మాణ రంగంలోనూ ఆయనకు నష్టాలు తప్పలేదు.
దిల్రాజు సంస్థ నుంచి ఈ యేడాది విడుదలైన తొలి సినిమా 'లవర్'. పెట్టుబడిలో పావువంతు కూడా వెనక్కి రాలేదని సమాచారం. తరవాత 'శ్రీనివాస కళ్యాణం'తో నిర్మాతగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. విడుదలకు ముందు సినిమా గురించి గొప్పగా చెప్పారు. కాని వసూళ్లు ఆశాజనకంగా లేవు. విడుదల తరవాత దిల్రాజు ఆ విషయాన్ని అంగీకరించారు. మొదట్లో వసూళ్లు అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ... మెల్లగా పుంజుకున్నాయని చెప్పారు.
ఆగస్టు వరకూ దిల్రాజు ఆశించినట్టుగా ఏదీ జరగలేదు. పోనీ, సెప్టెంబర్ నెలలో సీన్ మారుతుందని అనుకున్నా.. .మారలేదు. వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాను నైజాం ఏరియాలో దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ సంస్థ పంపిణీ చేసింది. విడుదలకు ముందు వచ్చిన హైప్, క్రేజ్ వల్ల మొదటిరోజు వసూళ్లు బావున్నప్పటికీ... పెట్టుబడి వెనక్కి రావడం కష్టమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. పంపిణీదారుడిగా దిల్ రాజుకు కూడా నష్టాలు తప్పవని అంటున్నారు. ఈ విధంగా ఈ స్టార్ నిర్మాతకు మరో దెబ్బ తగిలినట్టే అని చెబుతున్నారు.