సెన్సార్తో వర్మ లొల్లి... తీరు మారింది మళ్ళీ!
on Mar 18, 2019
రామ్ గోపాల వర్మ ఆదివారం అంతా ట్విట్టర్లో తెగ హడావిడి చేశారు. 'లక్ష్మిస్ ఎన్టీఆర్' విడుదలను సెన్సార్ బోర్డు అడ్డుకుంటోందని గగ్గోలు పెట్టారు. తొలి దశలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ ముగిసేవరకూ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సెన్సార్ దరఖాస్తును పరీశీలించలేమని సెన్సార్ బోర్డు లిఖత పూర్వకంగా తెలియజేసిందని వర్మ పేర్కొన్నారు. బయట వ్యక్తుల ఒత్తిళ్లకు తలొగ్గి, ఎవరికో లబ్ధి చేకూర్చడం కోసం సినిమాను చూడటానికి సెన్సార్ బోర్డు విముఖత వ్యక్తం చేస్తుందని, సినిమాను చూడకుండా వాయిదా వేసే అధికారం సెన్సార్ బోర్డుకు లేదని వర్మ మండిపడ్డారు. సెన్సార్ బోర్డు మీద కేసు వేస్తానని, బోర్డుకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తానని వీరావేశానికి లోనయ్యారు. సోమవారం ప్రెస్ మీట్ పెట్టి తన న్యాయవాదితో కలిసి సెన్సార్ తీరును ఎండగడతానని తెలిపారు. వర్మ ఆరోపణలతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు రాజకీయ రంగు అంటుకుందని ప్రేక్షకులంతా భావించారు. కానీ, రాత్రికి సీన్ మారింది. తన సినిమా నిర్మాణ సభ్యులకు, సెన్సార్ బోర్డు అధికారులకు మధ్య సమాచార లోపం, అపార్థాలు కారణంగా గందరగోళం నెలకొందని... ఇప్పుడంతా సద్దుమణిగిందని మరో ట్వీట్ చేశారు. ఆయన తీరు మారింది. దీనికి కారణం సెన్సార్ బోర్డు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సెన్సార్ చేయడానికి ముందుకొచ్చిందట. ఈ రోజో రేపో సినిమా సెన్సార్ అయ్యే అవకాశం ఉంది. అంతా సవ్యంగా జరిగితే ముందుగా అనుకున్నట్టు ఈ నెల 22న కాకుండా, 29న విడుదల చేయాలని అనుకుంటున్నారట.