అక్షయ్ చేసిన తప్పేంటి?
on Jul 25, 2017
పొరపాట్లు మానవ సహజం. ఒక్కోసారి మంచివారు కూడా పొరపాట్లు చేస్తుంటారు. తెలీక జరిగిన పొరపాటుని బూతద్దంలో చూడ్డం పెద్ద తప్పు. ఈ విషయాన్ని కొందరు ఎప్పుడు గ్రహిస్తారో ఏమో... బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయకుమార్ విషయంలో సోషల్ మీడియాలో ఈ ఆదివారం వినిపించిన విమర్శలు నిజంగా ఖండించాల్సినవే. ఆదివారం ఇంగ్లాండ్, ఇండియా దేశాలకు జరిగిన మహిళల వరల్డ్ కప్ ఫైనల్ ని ప్రత్యక్షంగా వీక్షించారు అక్షయ్. మన క్రీడాకారులను ఉత్తేజపరుస్తూ... లార్డ్స్ గ్యాలరీలో హంగామా చేశారు. ఇందులో భాగంగా మన జాతీయ జెండా చేతబూని టీమ్ కి ఛీర్ చేస్తున్న ఫొటో ఒకటి ఫేస్ బుక్, ట్విట్టర్లలో పోస్ట్ చేశాడు అక్షయ్. అతను చేసిన పెద్ద పొరపాటు అదే. ఇంతకీ ఆ ఫోటో షేర్ చేస్తే తప్పేంటి? అనేగా మీ అనుమానం. పోస్ట్ చేసిన ఆ ఫొటోలో అక్షయ్ జాతీయ జెండాను తల్లక్రిందులుగా పట్టుకొని ఉన్నాడు. అయితే... ఇది కావాలని చేసింది కాదని అందరికీ తెలుసు.
మన టీమ్ లో ఉత్సాహాన్ని నింపాలనే తపనలో జెండా పొజిషన్ ను గమనించలేదు అక్షయ్. కానీ... మన వాళ్లు ఎందుకూరుకుంటారు. విమర్శలతో చెలరేగిపోయారు. ‘ఏ... ఒళ్లు తెలీదా.. జెండా ఎలా ఉందో కూడా చూసుకోవా. ఇదేనా నీ దేశ భక్తి....’ అని ఎవరికి తోచినట్టు వారు కామెంట్లు పోస్ట్ చేసేశారు. అక్షయ్ ని తిట్టడంలోనే దేశభక్తి ఉందని వారి ఫీలింగ్. పాపం... ఈ కామెంట్లు చూసి విస్తుపోవడం అక్షయ్ వంతైంది. వెంటనే... తన ట్విట్టర్, ఫేస్ బుక్ నుంచి ఆ ఫోటోలను డిలిట్ చేసేశాడాయన. అంతేకాదు... అందరికీ క్షమాపణలు చెబుతూ... ఓ మెసేజ్ కూడా పోస్ట్ చేశాడు.
అసలు... ఇక్కడ పోస్టులు పెట్టిన వారందరూ దేశానికి ఏం చేశారు? అనే విషయాన్ని పక్కన పెడితే... అక్షయ్ కుమార్ మాత్రం దేశం కోసం చాలానే చేశాడు... చేస్తున్నాడు. ఆయనలోని దేశభక్తిని, సామాజిక బాధ్యతనీ వేలెత్తి చేపించే సాహసం చేయడానికి కూడా ఎవరకీ ఆస్కారం లేదన్నది నిజం. ఎన్నోసార్లు మన సైనిక కుటుంబాలకు ఆయన ఆర్థిక సాయం అందించారు. రైతుల కోసం పలు సేవాకార్యక్రమాలను నిర్వహించారు. అంతెందుకు... ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కహానీ’సినిమా చేస్తున్నాడు. రోడ్లపై నిలువ నీడ లేని అనాధ పిల్లల్ని చేరదీసి... వారి చదువు, పోషనార్థం లక్షలు ఖర్చుపెట్టిన ఉదంతాలున్నాయి. ఇవన్నీ మరిచిపోయి... చేతికొచ్చిన్నట్లు విమర్శలు పోస్ట్ చేయడం ఈ ‘దేశభక్తులకు?’ ఎంతవరకు సమంజసం ఆనేది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అవకాశం దొరికితే చాలు... ఎవర్నయినా ఏకి పారేయడం కొంతమందికి అలవాటుగా మారిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక అది మరీ ఎక్కువైందని చెప్పాలి. ఒకరి వంక మనం వేలెత్తి చూపిస్తే... మనవంక నాలుగు వేళ్లు చూస్తుంటాయని ఈ గురివిందలు ఎప్పుడు తెలుసుకుంటాయో?