ENGLISH | TELUGU  

సంక్రాంతికి మహా సమరమే!

on Oct 15, 2019

అనూహ్యంగా 'వెంకీ మామ' మూవీ సంక్రాంతి విడుదలకు సై అనడంతో.. ఒక్కసారిగా సంక్రాంతి సీజన్ వేడెక్కిపోయింది. ఇప్పటికే మహేశ్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ ఫిల్మ్ 'అల.. వైకుంఠపురములో'.. రెండూ జనవరి 12న వస్తున్నట్లు అఫిషియల్ అనౌన్స్‌మెంట్స్ వచ్చాయి. అఫిషియల్‌గా అనౌన్స్ చెయ్యకపోయినా 'వెంకీ మామ' మూవీ వాటికంటే ఒకరోజు ముందు, అంటే జనవరి 11న వస్తున్నట్లు సమాచారం. మొదట శుక్రవారమైన జనవరి 10న రిలీజ్ చేద్దామనుకున్నప్పటికీ, చివరకు 11వ తేదీని ఎంచుకున్నట్లు సురేశ్ ప్రొడక్షన్స్ కాంపౌండ్ నుంచి వినిపిస్తోంది.

ఇవి కాకుండా కల్యాణ్ రామ్ సినిమా 'ఎంత మంచివాడవురా' కూడా సంక్రాంతినే నమ్ముకుంటోంది. దాన్ని జనవరి 15న రిలీజ్ చెయ్యాలని నిర్మాణ సంస్థ ఆదిత్యా మ్యూజిక్ భావిస్తోంది. మహేశ్, బన్నీ లాంటి మహా మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ సినిమాలతో పోటీకి దిగడం దుస్సాహసం అని తెలిసినా, అప్పుడే రావాలని కల్యాణ్ రామ్ భావిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటివరకూ ఆడియో, వీడియో రంగంలో ఉన్న ఆదిత్యా మ్యూజిక్ సంస్థ 'ఎంత మంచివాడవురా' మూవీతోటే సినిమా ప్రొడక్షన్‌లో ఎంటరవుతోంది. గతంలో పేరుపొందిన మరో మ్యూజిక్ సంస్థ సుప్రీం ఆడియో కూడా ఫిల్మ్ ప్రొడక్షన్‌లోకి దిగి.. విష్ణు, అనుష్క జోడీగా 'అస్త్రం' మూవీని తీసి, చేతులు కాల్చుకుంది. ఇప్పుడు కథను నమ్ముకొనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఆదిత్యా మ్యూజిక్ అధినేతలు తమ సినిమా విడుదలకు సరైన సమయాన్ని ఎంచుకోకపోతే, దెబ్బతినే ప్రమాదముంది. 'ఎంత మంచివాడవురా' మూవీకి 'శతమానం భవతి' ఫేం సతీశ్ వేగేశ్న డైరెక్టర్.

మాస్ ఆడియెన్స్‌లో అమిత ఫాలోయింగ్ ఉన్న మహేశ్, అల్లు అర్జున్ చాలా రోజుల క్రితమే సంక్రాంతికి ఢీకొట్టాలని నిర్ణయించుకున్నారు. మొదట 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న, 'అల.. వైకుంఠపురములో' జనవరి 12న వస్తాయనే ప్రచారం జరిగింది. అయితే ఒకేసారి ఆ రెండు సినిమాల మేకర్స్ తమ సినిమాలు జనవరి 12న వస్తాయని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఓపెనింగ్స్ విషయంలో రెండు సినిమాలకూ దెబ్బేనని ట్రేడ్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. రెండు సినిమాలూ ఒకే రోజు విడుదలవడం వల్ల అందుబాటులో ఉన్న థియేటర్లను రెండు సినిమాలూ పంచుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం రెండింటికీ మార్కెట్‌లో బ్రహ్మాండమైన క్రేజ్ ఉంది. 'భరత్ అనే నేను', 'మహర్షి' సినిమాల తర్వాత మహేశ్ చేస్తున్న సినిమా కావడం, 'ఎఫ్2' సహా వరుస హిట్లతో టాప్ లీగ్‌లోకి అడుగుపెట్టిన అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో 'సరిలేరు నీకెవ్వరు' థియేట్రికల్ రైట్స్ కోసం బయ్యర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

మరోవైపు అల్లు అర్జున్, త్రివిక్రం మునుపటి సినిమాలు ఫ్లాపైనా, వాళ్ల కాంబినేషన్‌కు క్రేజ్ ఎంది. గతంలో వాళ్లిద్దరూ కలిసి చేసిన 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలు రెండూ ప్రేక్షకుల్ని అలరించాయి. పైగా ఇటీవల 'సామజవరగమన' పాటకు లభించిన ఆదరణ.. 'అల వైకుంఠపురములో' మూవీపై అంచనాల్ని పెంచేసింది. బన్నీ లుక్ కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఏమాత్రం బాగున్నా, సినిమాని సూపర్ హిట్ రేంజికి తీసుకెళ్లాలనే పట్టుదలతో ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే మహేశ్‌తో సంక్రాంతి సమరానికి బన్నీ అండ్ కో ఉత్సాహంగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో మేనమామ, మేనల్లుళ్లు వెంకటేశ్, నాగచైతన్య కూడా తమ 'వెంకీ మామ' మూవీతో సంక్రాంతి ఫైట్‌ను మరింత రసవత్తరంగా మార్చాలని భావిస్తున్నారు. 2019లో 'వినయ విధేయ రామ' వంటి భారీ మాస్ ఫిల్మ్, 'యన్.టి.ఆర్: కథానాయకుడు' వంటి బయోపిక్, సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ 'పేట' ధాటిని తట్టుకొని, వాటిని వెనక్కినెట్టేసి, 'ఎఫ్2'తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు వెంకటేశ్. 2020 సంక్రాంతికి 'వెంకీ మామ'తో ఆ మ్యాజిక్‌ని రిపీట్ చెయ్యాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నాడు. సొంత నిర్మాణ సంస్థ నిర్మిస్తుండటం, సురేశ్‌బాబు చేతుల్లో చాలా థియేటర్లు ఉండటం ఆ సినిమాకు కలిసొచ్చే అంశాలు.

ఇక తెలుగు స్ట్రెయిట్ సినిమాలతో మరోసారి పోటీ పడేందుకు సూపర్‌స్టార్ రజనీకాంత్ సిద్ధమవుతున్నాడు. 2019లో 'పేట'తో వచ్చినా, ఆశించినన్ని థియేటర్లు లభ్యంకాక అసంతృప్తికి గురైన ఆయన, ఈసారీ సంక్రాంతిని టార్గెట్ చేసుకొని, 'దర్బార్' మూవీతో వస్తున్నాడు. ఎ.ఆర్. మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ విడుదల తేదీ ఏమిటనేది అఫిషియల్‌గా వెల్లడికాలేదు. విడుదల తేదీగా జనవరి 10, జనవరి 15 రెండూ ప్రచారంలోకి వచ్చాయి. ఏదేమైనా 'దర్బార్'.. పొంగల్‌కు రావడం ఖాయం. అయితే 2019 కంటే, 2020 సంక్రాంతికి టాలీవుడ్ స్టార్స్ నుంచి రజనీకాంత్ మరింత గట్టిపోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈసారి కూడా 'దర్బార్'కు తగినన్ని థియేటర్లు లభించే అవకాశం కనిపించడం లేదు.

'వెంకీ మామ' మూవీతో పోలిస్తే.. 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' సినిమాలు రెండూ భారీ బడ్జెట్‌తో తయారవుతున్నాయి. పెట్టుబడి రావాలంటే, అత్యధిక థియేటర్లలో రిలీజ్ చెయ్యాల్సిన స్థితి. డిసెంబర్లో వస్తుందనుకున్న 'వెంకీ మామ' అనూహ్యంగా పోటీలోకి రావడం వాటి నిర్మాతలను కలవరపెట్టే విషయం. 'వెంకీ మామ'ను పోటీలోంచి తప్పించడానికి నిర్మాత సురేశ్‌బాబుతో మంతనాలు జరపాలని వారు భావిస్తున్నారని వినిపిస్తోంది. చూద్దాం.. ఏం జరుగుతుందో?.. ఒకవేళ 'వెంకీ మామ' పోటీ నుంచి తప్పుకున్నా సంక్రాంతికి 'మహా సంగ్రామం' తప్పదు. ఆ సంగ్రామంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారన్నది ఆసక్తి కలిగించే విషయం. గతంలో సంక్రాంతి బరిలో దిగిన సినిమాలన్నీ హిట్టయిన సందర్భాలున్నాయి. ఈసారీ అలా జరగాలనే ఆశిద్దాం. 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.