ప్రభాస్ భయపడ్డాడా..?
on Jan 23, 2018
అనుష్క లీడ్ రోల్లో పిల్ల జమీందార్ ఫేం జి. అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భాగమతి. హారర్ కమ్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు ఆ అంచనాలను మరింత పెంచాయి. రీసెంట్గా భాగమతి ఆడియో లాంచ్ ఘనంగా జరిగింది. తమిళ స్టార్ హీరో సూర్యతో పాటు శివగామి రమ్యకృష్ణ ఆడియో వేడుకలో సందడి చేశారు. ఇదంతా పక్కనబెడితే ఒక ప్రశ్న ఇప్పుడు సినీ జనాల మెదళ్లను తొలిచేస్తోంది. భాగమతి ఆడియో లాంచ్కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎందుకు రాలేదని.
ఈ చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రభాస్ సొంత సంస్థ.. ఈ బ్యానర్లో నిర్మించిన అన్ని సినిమాల ఆడియో ఈవెంట్లకి యంగ్ రెబల్స్టార్ చీఫ్ గెస్ట్గా వచ్చాడు. ఇక జేజేమ్మ అనుష్కతో ప్రభాస్కి ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్రెండ్స్ అంటే ప్రాణం ఇచ్చేసే ప్రభాస్ మరి భాగమతి పాటల వేడుకకి ఎందుకు రాలేదు అంటూ ఫిలింనగర్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ప్రభాస్-అనుష్కలు ప్రేమలో ఉన్నారని.. అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని వారిద్దరు ఖండించినప్పటికీ.. పుకార్ల జడివాన మాత్రం ఆగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అనుష్కతో ఒకే వేదిక మీద కనిపిస్తే.. ఆ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చినట్లు అవుతుందని ప్రభాస్ భయపడి ఉండవచ్చని కొందరంటుంటే.. సాహో షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారని మరికొందరు అంటున్నారు. ఏదీ ఏమైనా భాగమతి ఆడియో లాంచ్లో ప్రభాస్ మిస్సవ్వడం గాసిప్ రాయుళ్లకు కావాల్సినంత పనిని ఇచ్చింది.