ఏప్రిల్ 27.. ఆ రోజు కోసమే ఎందుకీ ఆరాటం?
on Feb 21, 2018
హీరోల మధ్య పోటీలు ఉండొచ్చు కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో రిలీజుల విషయంలో మాత్రం పోటీ పనికిరాదు. ఇప్పుడు సినిమారంగంలో వ్యాపార ధోరణి పెరిగిపోయింది. శుక్ర, శని, ఆదివారాల్లోనే డబ్బులు వెనక్కి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు నిర్మాతలు. స్టార్ హీరోల సినిమాలైతే.. సాధ్యమైనంత ఎక్కువ థియేటర్లలో ివిడుదల చేసి త్వరత్వరగా డబ్బులు లాగేసుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పోటీలకు దిగి ఒకేసారి ఒకేరోజున సినిమాలను విడుదల చేస్తే.. సినిమాలు బాగున్నా... నష్టాలు మాత్రం తప్పవ్.
ఎన్ని సినిమాలు విడుదలైనా భరించే శక్తి ఒక్క సంక్రాంతికి మాత్రమే ఉంటుంది. మిగిలిన సమయాల్లో కాస్త చూసి ప్లాన్ చేసుకోవడం శ్రేయస్కరం. అయితే... మన హీరోలు మాత్రం పంతాలకు దిగి.. నిర్మాతల కష్టాలు తెచ్చిపెడుతున్నారు.
రీసెంట్ గా తొలిప్రేమ, ఇంటిలిజెంట్ సినిమాల విషయంలో అదే జరిగింది.ఒకే ఫ్యామిలీ హీరోల సినిమాలు ఒకేసారి విడుదల చేయడంతో... బ్యాడ్ టాక్ తెచ్చుకున్న ‘ఇంటిలిజెంట్’ సినిమాకు ఓపెనింగులు కూడా కరువైపోయాయ్. నిర్మాతలకు తీరని నష్టాలు తెచ్చిపెట్టిందా సినిమా.
రాబోతున్న ఏప్రిల్ నెలలో కూడా మన హీరోలు ఇలాంటి తప్పే చేస్తున్నారు. ఏప్రిల్ 27న ఒకే రోజున మూడు పెద్ద సినిమాలు విడుదల చేసే సాహసానికి తెగబడ్డారు. రజనీకాంత్ ‘కాలా’, మహేశ్ బాబు ‘భరత్ అను నేను’, అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ సినిమాలు ఒకే రోజున తలపడనున్నాయంటూ వార్తలొస్తున్నాయ్. ఇదే గనుక జరిగితే.. నిర్మాతలకు భారీగా నష్టాలు ఖాయం.
ఒక వేళ సినిమాలకు మంచి టాక్ వచ్చినా రావాల్సిన వసూళ్లు మాత్రం రావ్. దీని మూలంగా నష్టపోయేది బయ్యేర్లే. అసలు ఆ రోజు కోసమే ఎందుకు ఆరాటం? అదేమన్నా సంక్రాంతా? ఎలాంటి ప్రత్యేకతా లేని ఆ రోజున ఒకేసారి మూడు సినిమాలూ విడుదల చేయాలనే ఆలోచన ఎందుకు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. రజనీకాంత్, మహేశ్, బన్నీ... ముగ్గురూ సాధారణమైన స్టార్లు కాదు. వీరి సినిమాలంటే థియేటర్ల సంఖ్య భారీగా ఉంటుంది. మరి ఇన్ని థియేటర్లు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయా? సరైన థియేటర్లు దొరక్క బలైపోయే సినిమా ఏంటి? ఏది ఏమైనా... బయ్యర్ల క్షేమం మాత్రం చూడాల్సిన బాధ్యత సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరిపై ఉంది. ఇప్పటికైనా కళ్లు తెరిస్తే మంచిది.