ఫిబ్రవరిలో రసవత్తరమైన యుద్ధం!
on Jan 25, 2018
బాక్సాఫీస్ వద్ద రసవత్తరమైన పోటీకి రంగం సిద్ధమైంది. ఇప్పటివరకూ ఇద్దరు హీరోల పోటీనే చూశాం.అతి త్వరలో ఇద్దరు నిర్మాతల యుద్ధాన్ని చూడబోతున్నాం. ఎవరా నిర్మాతలు? ఎందుకీ యుద్ధం? అనే విషయం చెప్పాలంటే... జరిగిన ఓ కథను చెప్పాలి.
నంది అవార్డుల విషయంలో.. కొన్ని రోజుల క్రితం జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. కొందరు నిర్మాతలైతే.. టీవీలకెక్కి గొడవ గొడవ చేశారు. వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేర్లు... బండ్ల గణేశ్, నల్లమలుపు బుజ్జి. వీరిద్దరినీ కూర్చోబెట్టి... ఓ ప్రముఖ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమం కూడా నిర్వహించింది.
ఆ కార్యక్రమంలోనే ఓ సంఘటన జరిగింది. ఆ సంఘటనే... రేపు విడుదల కాబోయే సినిమాల మధ్య రసవత్తరమైన పోటీకి కారణం అయ్యింది. ఆ సంఘటన పూర్వాపరాల్లోకెళ్తే...
నంది అవార్డుల ఎంపిక విషయంలో... నిర్మాత నల్లమలుపు బుజ్జి అప్పట్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. తొలిసారి టీవీకెక్కి మరీ తన అసహనాన్ని వ్యక్త పరిచారు. ‘ప్రకటించిన అవార్డులన్నీ తప్పుల తడక’ అంటూ అభియోగాన్ని వెలిబుచ్చాడు. సరిగ్గా అప్పుడే... లైవ్ షో జరుగుతుండగా... నిర్మాత సి.కల్యాణ్ ఫోన్ లైన్లోకి వచ్చాడు. నల్లమలుపు బుజ్జి, బండ్ల గణేశ్ ఇలా టీవీలకెక్కి సినిమా పరిశ్రమ పరువు తీయడం సబబు కాదని ఆయన ఫోన్ ద్వారా వారికి హితవు పలికాడు. అయితే.. ఈ సమయంలో నల్లమలుపు బుజ్జి, సి.కల్యాణ్.. ఇద్దరూ వ్యక్తిగత ఆరోపణలకు దిగారు.
‘అవార్డు రావడానికి నువ్వేమైనా గొప్ప సినిమా తీశావా?’ అని సి.కల్యాణ్ అంటే... ‘అసలు నీ జీవితంలో సరైన సినిమా ఒక్కటైనా నువ్వు తీశావా?’ అని నల్లమలుపు బుజ్జి విరుచుకుప్పడ్డాడు. ‘సరైన ఒక్క హిట్ లేని నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా?’ అంటూ సి.కల్యాణ్ పై అంతెత్తు లేచాడు బుజ్జి.
ఈ గొడవ జరిగిన కొన్ని రోజులకే ‘జై సింహా’ రూపంలో సి.కల్యాణ్ హిట్ కొట్టాడు. అంతే కాదు... రేపు ఫిబ్రవరిలో నల్లమలుపు బుజ్జి సినిమాతోనే పోటీగా రాబోతున్నాడు. అవును... ఫిబ్రవరి 2న నల్లమలపు బుజ్జి ‘టచ్ చేసి చూడు’ రిలీజ్ అవుతుంటే... ఫిబ్రవరి 9న సి.కల్యాణ్ ‘ఇంటిలిజెంట్’ విడుదల కానుంది.
‘టచ్ చేసి చూడు’ కథానాయకుడు రవితేజ అయితే... ‘ఇంటిలిజెంట్’ కథానాయకుడు సాయిధరమ్ తేజ్. ‘టచ్ చేసి చూడు’ విక్రమ్ సిరికొండకు దర్శకునిగా తొలి సినిమా. కానీ... ‘ఇంటిలిజెంట్’ సినిమాకు దర్శకుడు వి.వి.వినాయక్. ‘ఖైదీ నంబర్ 150’ తర్వాత వినాయక్ చేసిన సినిమా ఇది. అనుకోకుండా టీవీలో గొడవ పడ్డ ఇద్దరు నిర్మాతలు... ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద యుద్ధానికి సన్నద్ధమయ్యారు. మరి గెలుపెవరిదో?