ఇద్దరు ప్రధాన మంత్రులతో మొదలై
on Nov 8, 2017
నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నటిస్తూ, నిర్మించనున్న ఎన్టీఆర్ బయోపిక్ 2018 ద్వితీయార్ధంలో మొదలవనుంది. దర్శకుడు తేజ స్క్రిప్ట్ ని పదునుపెట్టే పనిలో బిజీ గా ఉన్నాడు. ఇంతకీ, తేజ తీయబోయే మొదటి సీన్ ఏంటో తెలుసా? చెబితే మీరు అమితానందం పొందడం ఖాయం. ఎందుకంటే, ఆ సీన్ కున్న ప్రత్యేకత అలాంటిది. ఒకప్పటి ప్రధాన మంత్రులు ఇందిరా గాంధీ, పీవీ నరసింహ రావులు ఇందులో కనిపించనున్నారు.
ఎన్టీఆర్ ని రాముడు, కృష్ణుడి ఫ్లెక్సీల్లో చూసిన ఇందిరా గాంధీ, అవి నిజంగా దేవుళ్ళవేమో అని అపోహపడి ఆ పటాలకి మొక్కుతుంది. మరి, ఎన్టీవోడిని ఆ అవతారంలో చూసిన ఎవరికయినా చేతులెత్తి మొక్కలనిపిస్తుంది కదా. ఇందుకు, ఇందిరా గాంధీ లాంటి వాళ్ళు కూడా మినహాయింపు కాదు. ఎందుకంటే, పెద్దాయనకున్న చరిష్మా అలాంటిది.
అయితే, అక్కడే ఉన్న పీవీ నరసింహ రావు అందులో ఉన్నది ఎన్టీఆర్ అని వివరేంచేసరికి విస్మయానికి గురయ్యిందట ఇందిరా గాంధీ. తర్వాత రాముడు, కృష్ణుడి పాత్రలు వేయడం ద్వారా ఎన్టీఆర్ ఎంత పాపులర్ అయ్యాడో చెప్పాడట. ఇదండీ తేజ ఎన్టీఆర్ బయోపిక్ కోసం తీయనున్న మొదటి సీన్. వాస్తవానికి ఓపెనింగ్ కి ఇంతకన్నా గొప్ప సీన్ ఏముంటుంది. మరి ఎన్టీఆర్ బయోపిక్ ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ వచ్చింది కదా. మీరూ, సినిమా చూడాలని తహతహలాడుతున్నారా. అయితే, 2019 సంక్రాంతి వరకు నిరీక్షించాల్సిందే!