ఆ ‘అమ్మ’ఎవరో ధైర్యంగా చెప్పగలవా వర్మ?
on Jul 4, 2017
రామ్ గోపాల్ వర్మకు ఇప్పుడు గట్టి చిక్కే వచ్చిపడింది. రక్త చరిత్ర, వంగవీటి చిత్రాల్లో కథ రిత్యా జరిగిన నిజాలను బయటకు తేకుండా లోపాయికారి తనంతో తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు అలా కుదరదు. మరి ఈ గడ్డు సమస్య నుంచి వర్మ ఎలా బయట పడతాడో పాపం! ఇంతకీ వర్మకు వచ్చిన చిక్కేంటి? అనుకుంటున్నారా! అక్కడే వస్తున్నా.
‘రక్తచరిత్ర2’లో ‘జరిగిన.. జరుగుతున్న... జరగబోతున్న హత్యలకు రక్తంతో తడిసిన రాయలసీమ మట్టే సాక్షి’అని సినిమాను ముగించేశాడు వర్మ. సరే.. అది ముగింపు లేని కథ కాబట్టి.. ఎటూ తేల్చకపోయినా జనాలు క్షమించేశారు. ఆ తర్వాత ‘వంగవీటి’తీశాడు. రంగా హత్యతో ఆ కథ ముగిసింది. రీసెర్చ్ చేసి తీశానని చెప్పుకున్నప్పుడు మరి రంగాను చంపింది ఎవరో క్లియర్ గా చెప్పాలి. కానీ చెప్పలేదు. ఆ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వకపోగా... ‘‘రంగాను చంపింది ఎవరో తెలిసింది ఒక్కరికే. ఆమె ఎవరో కాదు.. ’కొండమీదున్న అమ్మ‘’’అని తప్పించుకున్నాడు. అయితే ఈ విషయంలో జనాలు మాత్రం వర్మను క్షమించలేదు. ఆ పగ అంతా సినిమాపై తీర్చుకున్నారు.
మరి ఇప్పుడు ఎన్టీయార్ కథ వెండితెరపై ఆవిష్కరించనున్న ఈ తరుణంలో... ఆయన్ను పదవీచ్యుతుడ్ని చేసిన వ్యవహారంలో ప్రత్యక్షసాక్షి ఏ ‘అమ్మ’? ఆయన మహాభినిష్ర్కమణం చెందిన ఆ రాత్రి ఏం జరిగిందో తెలిసిన ఆ‘అమ్మ’ఎవరు? మరి ఈ ప్రశ్నలకు కూడా లోపాయికారిగా సమాధానం చెప్పి తప్పించుకుంటాడా? లేక తనకు తెలిసిన నిజాన్ని నిర్భయంగా చెబుతాడా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
అన్నగారూ... మా వర్మకు ఎన్ని తిప్పలు తెచ్చిపెట్టారు! ప్చ్ పాపం.