ఘట్టమనేని మహేశ్ బాబు తెలుగు సినీ నటుడు మరియు ప్రఖ్యాత నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు. ఈయన ఆగష్టు 9, 1974 లో చెన్నై నగరంలో జన్మించాడు. ఇతన్ని ప్రిన్స్ మహేష్ బాబు అని కూడా అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. ఇతను ప్రఖ్యాత తెలుగు సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ మరియు ఇందిరాదేవిల కుమారుడు. ఇతనికి ఒక అన్నయ్య రమేశ్, ఇద్దరు అక్కలు (పద్మావతి మరియు మంజుల) మరియు ఒక చెల్లెలు ప్రియదర్శని గలరు. హిందీ నటి, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ ఇతని భార్య. వీరి కుమారుడు గౌతమ్.
మహేష్ బాబు నటనాజీవితం తన తండ్రి చిత్రాలలో బాలనటుడిగా ఆరంభమయ్యింది. ఆ తరువాత చదువు మీద దృష్టి కేంద్రీకరించడం కోసం మహేష్ సినిమాలనుండి విరామం తీసుకున్నాడు. డిగ్రీ పూర్తి అయ్యాక సినిమా రంగానికి తిరిగివచ్చాడు. హీరోగా మహేశ్ తొలి చిత్రం రాజకుమారుడు. ఆ తర్వాత వచ్చిన యువరాజు, వంశీ చిత్రాలు వ్యాపార పరంగా పెద్ద విజయాల్ని సాధించకపోయినా మహేష్ నటనకు గుర్తింపు లభించింది.
2001లో సోనాలి బింద్రే సరసన కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం మహేష్ కు తొలి భారీ విజయాన్ని అందించింది. కానీ 2002 మహేష్ కు సంతృప్తిని ఇవ్వలేదు. ఆ సంవత్సరం విడుదల అయిన టక్కరి దొంగ, బాబీ రెండూ కూడా పరాజయం పాలయ్యాయి.
2004లో మహేష్ కు తను ఎదురుచూస్తున్న విజయం లభించింది. గుణశేఖర్ దర్శకత్వంలో విడుదల అయిన ఒక్కడు చిత్రం 2003వ సంవత్సరానికి అతి పెద్ద హిట్ చిత్రంగా నిలచింది. భూమిక కథానాయికగా, ప్రకాష్ రాజ్ ప్రతినాయకునిగా తయారయిన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని మహేష్ సినీ జీవితంలో మైలురాయిగా నిలచింది.
2003లోనే విడుదల అయిన నిజం చిత్రం పరాజయం పాలయినప్పటికీ మహేష్ నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఈ చిత్రంలోని నటనకు గానూ మహేష్ ఉత్తమ నటునిగా రాష్ట్ర ప్రభుత్వపు బంగారు నంది పురస్కారాన్ని అందుకున్నాడు. 2004లో తమిళనాట విజయవంతమైన న్యూ చిత్రం మహేష్ ముఖ్యపాత్రధారిగా తెలుగులో నాని గా పునర్నిర్మితమయ్యింది. మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించినప్పటికీ ఈ చిత్రం మాత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యింది.
అదే ఏడు విడుదలైన అర్జున్ పరాజయం కానప్పటికీ అంచనాలను అందుకోలేదని చెప్పాలి. 18కోట్ల ఖర్చుతో నిర్మితమయిన ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. అటు పిమ్మట మహేష్ ఒక సంవత్సరం పాటు ఏ చిత్రాన్నీ అంగీకరించలేదు. అతడు చిత్ర నిర్మాణంలో పూర్తిగా నిమగ్నమయ్యాడు.
2005లో విడుదల అయ్యిన అతడు చిత్రం తెలుగునాట మాత్రమే కాక, విదేశాలలోని తెలుగువారి మన్ననలను అందుకుంది. స్వతహాగా మంచివాడయ్యినప్పటికీ పరిస్థితుల వలన కిరాయిహంతకుడై, తోటివారి ద్రోహం వలన ఇంకొకరి ఇంట్లో మారుపేరుతో తలదాచుకునే నందగోపాల్ పాత్రలో మహేష్ పలికించిన హావభావాలు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి. ఈ సినిమాలో నటనకు మహేష్ కు మరొకసారి బంగారు నంది లభించింది.
2006లో మహేష్ నటించిన చిత్రం పోకిరి విడుదల అయ్యింది. వ్యాపార పరంగా ఈ చిత్రం అమోఘమయిన విజయాన్ని నమోదుచేసింది. దక్షిణ భారత సినీ చరిత్రలో ఈ చిత్రం అతి పెద్ద హిట్ గా నిలచింది. ఈ చిత్రంలో మహేష్ నటనకు ఆశేషాంధ్ర ప్రజానీకం నీరాజనాలు పలికింది. భారతీయ సినీదిగ్గజాలుగా పేరెన్నికగన్న అమితాబ్ బచ్చన్, రాంగోపాల్ వర్మ తదితరులెందరో మహేష్ నటనను శ్లాఘించారు . ఈ చిత్రానికి గాను మహేష్ ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని సైతం గెలుకున్నాడు.
పోకిరీ తరువాత నిర్మాణం అయిన సైనికుడు చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది.సైనికుడు తరువాత నిర్మాణం అయిన అతిథి చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది.ఇటీవలే మహేష్ బాబు ప్రఖ్యాత సామూహిక సంభాషణ వెబ్ సైటు అయిన ట్విట్టర్ లో సభ్యులయ్యాడు.
పురస్కారాలు నటునిగా మహేష్ వయసు తక్కువే అయినా ఇతని నటనా పటిమకు అది అడ్డంకి కాలేదు. చిత్ర జయాపజయాలతో సంబంధం లేకుండా తొలి చిత్రం నుండి మహేష్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.
* ఉత్తమ నూతన నటుడు: రాజకుమారుడు (1999)
* ఉత్తమ నటుడు బంగారు నంది : నిజం (2002)
* ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు: ఒక్కడు (2002)
* ఉత్తమ నటుడు బంగారు నంది : అతడు (2005)
* ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు అర్హత: అతడు (2005)
* ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు: పోకిరీ (2006)
|