Facebook Twitter
పగటికల తెచ్చిన తిప్పలు

పగటికల తెచ్చిన తిప్పలు

 

 

మీనాక్షమ్మ చాలా మంచిది. అందరికీ సహాయపడేది. కానీ ఆమె కొడుకు రాము మాత్రం ఏ పని చేయకుండా జులాయిగా తిరిగేవాడు. తల్లి ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి కొడుకును చదివిస్తుంటే, రాము మాత్రం చదువు కోకుండా అల్లరి చిల్లరిగా తిరిగేవాడు.


"ఏమిరా రామూ?! ఎప్పుడూ అలా తిరుగుతుంటావు? చదువూ సంధ్యా లేదా? మీ బళ్ళో ఎవ్వరూ ఏమీ అనరా, ఇలా తిరిగితే?" అని ఎవరైనా అడిగితే, "ఓహో, నా గురించి మీకేం తెలుసు? నేను ఎంత తెలివైన వాడినంటే, నాకు పదవతరగతిలో జిల్లా ఫస్టు ఖాయం. చూస్తూండండి, ఆ తర్వాత నేను ఐఎఎస్సాఫీసర్నవుతాను- అప్పుడుగానీ మీ అందరినోళ్ళూ మూతపడవు" అని బుకాయించి తన దారిన తను పోయేవాడు.

అలా ఎందుకైందో ఏమో గానీ- రాను రాను రాము వాస్తవాల్ని మరచిపోయి, ఎప్పుడూ పగటి కలల్లోనే విహరించటం మొదలైంది. ఊరికే కూర్చొని 'నేను ఇట్లా అవుతాను గదా, అప్పుడు చాలా బాగుంటుంది; ఆ తర్వాత ఇట్లా అవుతుంది- ఇంకా చాలా బాగుంటుంది!' అని అనుకుంటూ ఆనందపడేవాడు.

ఒక రోజున ఇట్లాగే పగటి కలలు కంటూ కూర్చున్న రాముని వచ్చి పలకరించాడు ఒక రైతు. "నాకు 25 తాటి చెట్లు ఉన్నాయి. ఆ తాటి చెట్లు ఎక్కి, తాటికాయలు కోసి క్రిందకు దించితే- చెట్టుకు 25 రూపాయలు చొప్పున ఇస్తాను" అన్నాడు. రాముకు చదవటం అంటే ఎంత అయిష్టం ఉన్నా, చెట్లు ఎక్కడం అంటే మాత్రం చాలా ఇష్టం!

అందుకని, రైతు మాట వినగానే రాము "సరే" అని బయలుదేరాడు. అయితే ఒక వైపున తాటి చెట్టు ఎక్కి తాటికాయలు కోస్తుండగానే వాడి ఆలోచనలు పరుగులు తీసాయి: "చెట్టుకి 25రూపాయలు వస్తాయి, నాకు. ఈ డబ్బుల్ని నేను మా అమ్మకు ఇస్తే, నా పుట్టిన రోజుకు బట్టలు, కేకులు కొనిపెడుతుంది. అప్పుడు నేను కేకును కోసి అమ్మకు తినిపిస్తాను. అమ్మ 'నాకెందుకురా' అంటూనే తింటుంది-'నీకు నేనంటే ఎంత ఇష్టంరా' అంటుంది. అప్పుడు నేను ఇట్లా నవ్వి, 'ఇంత!' అని చూపిస్తాను-" అనుకుంటూ తన చేతులు రెండూ వదిలిపెట్టాడు. అంతే!

ఆ తర్వాత తెలివి వచ్చి చూసేసరికి రాము కింద పడి ఉన్నాడు. ముందరి పళ్ళు రెండూ ఊడిపోయాయి. అమ్మ వచ్చి, వాడిని బాగా తిట్టి ఆసుపత్రికి తీసుకెళ్ళింది. పగటి కలలు ఎన్ని కష్టాల్ని కొని తెస్తాయో అనుభవం కొద్దీ గ్రహించిన రాము, ఆ తరువాత వాస్తవంలో బ్రతకటం అలవరచుకున్నాడు.

 

Courtesy..
kottapalli.in